మీ జీతంలో జరిగే చిన్న మార్పు మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం రాబోతున్న కొత్త వేతన నిబంధనల వల్ల మీ చేతికి వచ్చే జీతం కొంచెం తగ్గినా, గ్రాట్యుటీ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు మాత్రం పెరుగుతాయి. దీనికి ప్రధాన కారణం ’50 శాతం బేసిక్ పే’ నిబంధన. సాధారణంగా కంపెనీలు తమ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి బేసిక్ జీతాన్ని తక్కువగా ఉంచి.. అలవెన్సులను ఎక్కువగా ఇస్తుంటాయి. కానీ కొత్త నిబంధన ప్రకారం.. మీ మొత్తం జీతంలో ‘బేసిక్ పే’ కనీసం 50 శాతం ఉండాలి. గ్రాట్యుటీ అనేది బేసిక్ జీతంపై ఆధారపడి లెక్కించబడుతుంది కాబట్టి, బేసిక్ పెరిగితే మీ గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది.
ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఏడాదికి 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడనుకుందాం. పాత పద్ధతిలో బేసిక్ 40 శాతంగా ఉంటే, నెలకు 40 వేల రూపాయలు బేసిక్ అవుతుంది. దీనివల్ల ఏడాదికి సుమారు 23 వేల రూపాయల గ్రాట్యుటీ వస్తుంది. అదే కొత్త నిబంధనతో బేసిక్ 50 శాతానికి పెరిగితే.. అది 50 వేల రూపాయలు అవుతుంది. అప్పుడు గ్రాట్యుటీ ఏడాదికి సుమారు 28 వేల రూపాయలకు పెరుగుతుంది. అంటే ఇక్కడ తేడా తక్కువగానే ఉంటుంది.
కానీ ఎక్కువ జీతం తీసుకునే వారిపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఏడాదికి 30 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తికి బేసిక్ జీతం ప్రస్తుతం 30 శాతంగా ఉంటే, అది నెలకు 75 వేల రూపాయలు ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం అది 1.25 లక్షలకు పెరుగుతుంది. దీనివల్ల ఏడాదికి వచ్చే గ్రాట్యుటీ 43 వేల నుంచి ఏకంగా 72 వేల రూపాయలకు పెరుగుతుంది. అంటే దాదాపు 28 వేల రూపాయల లాభం చేకూరుతుంది. ఎవరికైతే బేసిక్ జీతం చాలా తక్కువగా ఉందో.. వారికి ఈ కొత్త నిబంధన వల్ల భవిష్యత్తులో వచ్చే డబ్బు ఎక్కువగా పెరుగుతుంది. మీరు ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేస్తే, ఈ మార్పు వల్ల రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. ప్రస్తుతం మీ చేతికి వచ్చే జీతం కొంచెం తగ్గినా, అది పొదుపు రూపంలో మీ భవిష్యత్తుకు భద్రతను ఇస్తుంది. ఇది ఉద్యోగులకు దీర్ఘకాలంలో మంచి మేలు చేసే మార్పు.
