Milky Mist Founder: చిన్న వయసులోనే కుటుంబ వ్యాపార బాధ్యతలు భుజాన వేసుకున్న ఓ యువకుడు.. నేడు వేల కోట్ల విలువైన డెయిరీ కంపెనీకి అధిపతిగా ఎదిగారు. ఆయన మరెవరో కాదు.. ‘మిల్కీ మిస్ట్’ వ్యవస్థాపకుడు సతీష్ కుమార్ టి. కేవలం 10 కిలోల పనీర్తో ప్రారంభమైన ఆయన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 వేల కోట్లకు పైగా విలువైన సంస్థగా మారింది. ఆగస్టు 11, 2026న మిల్కీ మిస్ట్ ఐపీఓకు రానుండటంతో సతీష్ కుమార్ సక్సెస్స్టోరీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులోని ఈరోడ్కు చెందిన సతీష్ కుమార్ కుటుంబం తొలుత పవర్లూమ్ వ్యాపారం చేసేది. అది నష్టాల్లో మూతపడటంతో 1980లలో పాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. స్థానికంగా రైతుల నుంచి పాలను సేకరించి బెంగళూరుకు తరలించేవారు. అయితే వారికి ఈ వ్యాపారం కూడా ఆశించిన స్థాయిలో లాభాలు ఇవ్వలేదు. చివరకు 1992లో పాల వ్యాపారాన్ని కూడ మూసివేశారు. అప్పటికి సతీష్ కుమార్ వయసు కేవలం 16 ఏళ్లు. ఆ వయసులో ఆయన తన చదువు కొనసాగించకుండా కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవాలనే బాధ్యతలు తీసుకున్నారు. బెంగళూరులో ఓ వ్యక్తి పాలతో పనీర్ తయారు చేసి హోటళ్లకు విక్రయిస్తున్న విషయాన్ని గమనించిన ఆయన.. అదే రంగంలో అవకాశాన్ని గుర్తించారు.
10 కిలోల పనీర్తో తొలి అడుగు..
పనీర్ తయారీపై ఎలాంటి శిక్షణ లేకపోయినా సతీష్ స్వయంగా ప్రయోగాలు చేశారు. తొలినాళ్లలో ఎన్నోసార్లు విఫలమైనప్పటికీ పట్టువిడవ లేదు. చివరకు 1993లో 10 కిలోల పనీర్ను సంచిలో పెట్టుకుని బెంగళూరుకు వెళ్లి విక్రయించారు. హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తూ క్రమంగా వ్యాపారాన్ని పెంచుకున్నారు. 1995 నాటికి రోజుకు 50 నుంచి 100 కిలోల పనీర్ విక్రయించే స్థాయికి చేరుకున్నారు. పచ్చి పాలను విక్రయించడం కంటే అదే పాలను పనీర్, పెరుగు, వెన్న, నెయ్యి వంటి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చితే మెరుగైన లాభాలు పొందవచ్చని సతీష్ గుర్తించారు. 1997లో రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించి ‘మిల్కీ మిస్ట్’ బ్రాండ్ను ప్రారంభించారు. అనంతరం పెరుగు, చీజ్, యోగర్ట్, ఐస్క్రీమ్ తదితర ఉత్పత్తులను విస్తరించారు. ఉత్పత్తుల నాణ్యతను కాపాడేందుకు కోల్డ్చైన్, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, ఆటోమేటెడ్ ప్లాంట్లపై భారీగా పెట్టుబడులు పెట్టారు. దక్షిణ భారతదేశంలో బ్రాండ్ను బలోపేతం చేస్తూ దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించారు. మిల్కీ మిస్ట్ ఆదాయం 2024లో రూ.1,826.86 కోట్ల నుంచి 2025లో రూ.2,354.79 కోట్లకు, 2026లో రూ.3,145.01 కోట్లకు చేరినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో నికర లాభం రూ.19.44 కోట్ల నుంచి రూ.127.01 కోట్లకు పెరిగింది. ఇప్పుడు ఆగస్టు 11న (రేపు) రూ.1,553 కోట్ల ఐపీఓతో మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు కంపెనీ సిద్ధమైంది. ఇందులో రూ.1,428 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, రూ.125 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నట్లు సమాచారం. ఐపీఓ అనంతరం కంపెనీ విలువ సుమారు రూ.10,778 కోట్లకు చేరుతుందని అంచనా. 16 ఏళ్ల వయసులో 10 కిలోల పనీర్తో మొదలైన సతీష్ కుమార్ ప్రయాణం.. నేడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మారింది.

