2026 ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో ఇన్కమ్ టాక్స్ (ఆదాయపు పన్ను) నిబంధనల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. దాదాపు 60 ఏళ్ల నాటి పాత చట్టం స్థానంలో ‘ఆదాయపు పన్ను చట్టం 2025’ అమల్లోకి వస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ముఖ్యమైన మార్పులు ఇవే..
1. ‘ట్యాక్స్ ఇయర్’ (Tax Year) అనే కొత్త పదం
ఇప్పటివరకు మనం ‘ప్రీవియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్’ అని రెండు వేర్వేరు పేర్లు వాడేవాళ్లం. కొత్త చట్టం ప్రకారం వీటన్నిటినీ కలిపి కేవలం ‘ట్యాక్స్ ఇయర్’ అని పిలుస్తారు. దీనివల్ల గందరగోళం తగ్గి పన్ను చెల్లింపులు సులభతరం అవుతాయి.
2. మారని టాక్స్ స్లాబ్లు..
డైరెక్ట్ టాక్స్ చెల్లించే సామాన్య ఉద్యోగులకు ఒక మంచి వార్త. పాత పద్ధతిలో గానీ, కొత్త పద్ధతిలో గానీ ఆదాయపు పన్ను రేట్లలో (Tax Slabs) ఎటువంటి మార్పులు చేయడం లేదు. అంటే మీరు కట్టే పన్ను భారం పెరగదు.
3. ఐటీ రిటర్న్స్ (ITR) గడువు తేదీల్లో మార్పు..
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువు తేదీలను ప్రభుత్వం కొంచెం పెంచింది. సొంతంగా వ్యాపారం లేదా ఏదైనా వృత్తి చేసేవారు ఇప్పుడు జూలై 31 కి బదులు ఆగస్టు 31 వరకు రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. మామూలుగా ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫైల్ చేసే వారికి మాత్రం పాత గడువు (జూలై 31) అలాగే ఉంటుంది.
4. తప్పులు సరిదిద్దుకోవడానికి మరికొంత సమయం..
మీరు ఫైల్ చేసిన రిటర్న్స్లో ఏవైనా తప్పులుంటే.. వాటిని సరిచేసి మళ్ళీ ఫైల్ చేయడానికి (Revised Return) గడువును 9 నెలల నుంచి 12 నెలలకు పెంచారు. అయితే.. 9 నెలలు దాటిన తర్వాత ఫైల్ చేస్తే రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు ఫీజు కట్టాల్సి ఉంటుంది.
5. షేర్ మార్కెట్ ట్రేడింగ్పై పన్ను పెంపు..
షేర్ మార్కెట్లో ‘ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్’ (F&O) చేసే వారికి ట్యాక్స్ పెరగనుంది. ఊహాజనిత వ్యాపారాలను తగ్గించడానికి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) రేట్లను ప్రభుత్వం పెంచింది. ఆప్షన్స్ అమ్మకంపై పన్ను 0.10 శాతం నుంచి 0.15 శాతానికి పెరిగింది.
6. ఆఫీస్ ప్రయాణ ఖర్చులపై ఊరట
ఆఫీసు నుంచి ఇంటికి.. ఇంటి నుంచి ఆఫీసుకి వెళ్లడానికి కంపెనీలు ఇచ్చే ప్రయాణ ఖర్చులపై ఇకపై పన్ను పడదు. దీని పరిధిని ప్రభుత్వం మరింత పెంచింది.
Also Read:Telangana Assembly : ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. ఈనెల 20న బడ్జెట్..
7. విదేశీ ప్రయాణాలు, చదువులపై TCS తగ్గింపు
విదేశీ టూర్ ప్యాకేజీలపై ఇదివరకు ఉన్న 5 శాతం, 20 శాతం పన్ను స్థానంలో ఇప్పుడు అందరికీ ఒకే రకమైన 2 శాతం పన్ను (TCS) ఉంటుంది. విదేశీ చదువు లేదా వైద్యంపై రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే.. పన్నును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు.
8. మ్యూచువల్ ఫండ్స్ , డివిడెండ్లపై నిబంధనలు..
ఇంతకుముందు డివిడెండ్ ఆదాయం కోసం చేసిన అప్పుపై 20 శాతం వరకు వడ్డీ మినహాయింపు ఉండేది. కానీ కొత్త చట్టం ప్రకారం.. డివిడెండ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఆదాయంపై ఎటువంటి వడ్డీ మినహాయింపులు లభించవు. మొత్తానికి 2026 ఏప్రిల్ నుంచి రాబోయే ఈ మార్పులు పన్ను విధానాన్ని సరళతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కొన్ని చోట్ల పన్ను భారాలు పెరిగినా.. మరికొన్ని చోట్ల నిబంధనలు సులభతరం అయ్యాయి.
