Site icon NTV Telugu

HDFC బ్యాంక్ ఛైర్మన్ సంచలన రాజీనామా.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

Hdfc Bank

Hdfc Bank

HDFC: దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్ & స్వతంత్ర డైరెక్టర్ అటాను చక్రవర్తి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. అయితే, ఇది సాధారణ రాజీనామా కాదని, బ్యాంక్ పనితీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో తీవ్ర చర్చకు దారితీశాయి.

READ ALSO: Dhurandhar 2: 1,300 మందిని కాదని ‘యెలినా’గా సారా అర్జున్.. ‘ధురందర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్!

రాజీనామాకు కారణం ఏంటి..
మార్చి 15న తన రాజీనామా లేఖను సమర్పించిన చక్రవర్తి, అందులో సంచలన విషయాలను ప్రస్తావించారు. గత రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పరిణామాలు తన వ్యక్తిగత విలువలు, నైతిక సూత్రాలకు (Ethical Principles) విరుద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఈ కారణం చేతనే తాను తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఛైర్మన్ స్థాయిలో నైతికతపై ప్రశ్నలు తలెత్తినప్పటికీ, బ్యాంక్ యాజమాన్యం మాత్రం ఆచితూచి స్పందించింది. మార్చి 18న ఆయన రాజీనామాను ధృవీకరిస్తూ, ఇప్పటివరకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు మార్చి 19న స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా సమాచారం అందించింది.

తాత్కాలిక ఛైర్మన్‌గా కేకి మిస్త్రీ
ఈ ఆకస్మిక పరిణామంతో అప్రమత్తమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), బ్యాంక్ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టింది. కేకి మిస్త్రీని తదుపరి మూడు నెలల పాటు తాత్కాలిక (పార్ట్-టైమ్) ఛైర్మన్‌గా నియమించడానికి ఆమోదం తెలిపింది. ఈ నియామకం మార్చి 19, 2026 నుంచే అమల్లోకి వచ్చింది. మే 2021లో బాధ్యతలు చేపట్టిన అటాను చక్రవర్తి హయాంలోనే HDFC లిమిటెడ్, HDFC బ్యాంక్‌ల చారిత్రాత్మక విలీనం జరిగింది. ఈ విలీనం తర్వాత బ్యాంక్ దేశంలోనే రెండో అతిపెద్ద రుణదాతగా అవతరించింది. అయితే, ఈ మెగా విలీనం ద్వారా ఆశించిన ప్రయోజనాలు, లక్ష్యాలు ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదని చక్రవర్తి తన నిష్క్రమణ సమయంలో అభిప్రాయపడటం గమనార్హం. ఈ పరిణామాలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లపై ప్రభావం చూపుతున్నాయి. బుధవారం ట్రేడింగ్‌లో బ్యాంక్ షేరు రూ.843.05 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో ఈ షేరు దాదాపు 8% కంటే ఎక్కువ పతనమైంది. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల వల్ల మార్కెట్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ, గత వారం ఈ షేరు స్వల్పంగా (2.5%) లాభపడింది. కానీ, తాజాగా ఛైర్మన్ రాజీనామాతో ఇన్వెస్టర్లలో మళ్లీ ఆందోళన మొదలైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

READ ALSO: Dhurandhar 2: రణవీర్ సింగ్ నటనకు ఐకాన్ స్టార్ ఫిదా.. ‘ధురంధర్ 2’ పై అల్లు అర్జున్ రివ్యూ వైరల్!

Exit mobile version