Gautam Adani: ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అమెరికాలో భారీ షాక్ తగిలింది. వీరిద్దరిపై మొత్తం 18 మిలియన్ డాలర్ల (సుమారు రూ.150 కోట్లు) పౌర ద్రవ్య జరిమానా (Civil Monetary Penalties) విధించాలని యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ప్రతిపాదించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు సంబంధించిన ఒక వివాదంలో ఈ ముందస్తు జరిమానాలు చెల్లించడానికి అదానీలు అంగీకరించారు.
అసలు వివాదం ఏంటి..
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 2021లో చేపట్టిన బాండ్ ఆఫరింగ్కు సంబంధించి.. పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించేలా అబద్ధపు ప్రకటనలు చేశారనేది ప్రధాన ఆరోపణ. భారతదేశంలో భారీ సౌరశక్తి (సోలార్ పవర్) కాంట్రాక్టులను దక్కించుకోవడానికి అదానీలు ఒక పెద్ద లంచాల పథకాన్ని రూపొందించారని, అయితే అమెరికా పెట్టుబడిదారుల వద్దకు వచ్చేసరికి తాము ఎలాంటి అవినీతి పద్ధతులు పాటించడం లేదంటూ తప్పుడు సమాచారం ఇచ్చారని యూఎస్ ఏజెన్సీలు నిర్ధారించాయి.
ఎవరిపై ఎంత జరిమానా అంటే..
ఎస్ఈసీ (SEC) ప్రతిపాదించిన ఈ జరిమానాలో భాగంగా.. గౌతమ్ అదానీపై 6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.50 కోట్లు), సాగర్ అదానీపై 12 మిలియన్ డాలర్లు (సుమారు రూ.100 కోట్లు) జరిమానా విధించారు. “సివిల్ ఫిర్యాదులో చేసిన ఆరోపణలను మేము అంగీకరించడం లేదు.. అలాగని ఖండించడం లేదు. కానీ, కోర్టు తుది తీర్పును గౌరవిస్తూ వరుసగా 6 మిలియన్ డాలర్లు, 12 మిలియన్ డాలర్ల సివిల్ జరిమానా చెల్లించడానికి గౌతమ్ అదానీ, సాగర్ అదానీ అంగీకరించారు” అని అదానీ గ్రీన్ ఎనర్జీ ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో అధికారికంగా వెల్లడించింది. మే 14న న్యూయార్క్ కోర్టులో దాఖలు చేసిన ప్రతిపాదిత తుది తీర్పులలో ఈ జరిమానాలు ఒక భాగంగా ఉన్నాయి.
రూ. 2200 కోట్ల లంచాల ఆరోపణలు!
గతేడాది (2024) నవంబర్లో ఈ సంచలన అవినీతి కుంభకోణం బయటపడింది. ఒక ప్రధాన సోలార్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా రాబోయే రెండు దశాబ్దాలలో దాదాపు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16,600 కోట్లు) లాభాలను ఆర్జించేలా కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం.. భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,200 కోట్లు) లంచాలు ఇవ్వడానికి అదానీలు పథకం వేశారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
అవినీతిని దాచిపెట్టి రూ. 25,000 కోట్ల సమీకరణ
ఈ మొత్తం లంచాల వ్యవహారాన్ని, అవినీతిని అంతర్జాతీయ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి దాచిపెట్టి.. రుణాలు, బాండ్ ఆఫరింగ్ల ద్వారా అదానీ గ్రూప్ ఏకంగా 3 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 25,000 కోట్లు) నిధులను సమీకరించిందని యూఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ మాజీ సీఈఓ వినీత్ జైన్ కూడా నిందితులుగా ఉన్నారు. వీరిపై సెక్యూరిటీస్ మోసం, సెక్యూరిటీస్ మోసం కుట్ర మరియు వైర్ ఫ్రాడ్ కుట్ర వంటి తీవ్రమైన క్రిమినల్, సివిల్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అమెరికా ఏజెన్సీల ఆధ్వర్యంలో ఈ కేసుల సమీక్ష కొనసాగుతోంది.
