ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్‌ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు

Atmwithdrawals

Atmwithdrawals

ATM Charges: దేశంలో ఏటీఎంల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో నగదు ఉపసంహరణకు సంబంధించిన ఛార్జీల్లో మార్పులు వచ్చాయి. ఆన్‌లైన్‌ లావాదేవీలకు ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతుండగా, కెనరా బ్యాంక్‌ సెప్టెంబర్‌ 1 నుంచి ఏటీఎం లావాదేవీలపై కొత్త ఛార్జీలను అమల్లోకి తీసుకొచ్చింది. కెనరా బ్యాంక్‌ పొదుపు ఖాతాదారులకు ఏటీఎంలో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలకు కలిపి నెలకు ఉచిత లావాదేవీల పరిమితిని ఐదుకు తగ్గించింది. అయితే సీనియర్‌ సిటిజన్లకు వర్తించే ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదు.

ఉచిత పరిమితి దాటిన తర్వాత కెనరా బ్యాంక్‌ ఏటీఎంలలో నగదు ఉపసంహరణతో పాటు యూపీఐ నగదు ఉపసంహరణకు విధించే ఛార్జీని రూ.20 నుంచి రూ.23కు పెంచింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో చేసే లావాదేవీలకు కూడా ఛార్జీని రూ.17 నుంచి రూ.23కు పెంచినట్లు సమాచారం. ఆర్థికేతర లావాదేవీలకు మాత్రం ఉచిత పరిమితి దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.5తో పాటు జీఎస్టీ వసూలు చేసే విధానంలో ఎలాంటి మార్పు లేదు. ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో ఏటీఎం లావాదేవీ విఫలమైనా కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. మరోవైపు క్లాసిక్‌, స్టాండర్డ్‌, ప్లాటినం, బిజినెస్‌, సెలెక్ట్‌, వరల్డ్‌ కార్డులకు ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత గ్రీన్‌ పిన్‌ రీజెనరేషన్‌ ఫీజును కెనరా బ్యాంక్‌ రూ.23 నుంచి రూ.5కు తగ్గించింది. దీంతో ఏటీఎం వినియోగించే కస్టమర్లు కొత్త ఛార్జీలను గమనించాల్సిన అవసరం ఉంది.