Business Today: ‘సన్ ఫ్లవర్’ దిగుమతి.. హైదరాబాద్ సంస్థ రికార్డ్
2020-21 ఆర్థిక సంవత్సరంలో పొద్దుతిరుగుడు పువ్వు ముడి వంట నూనెను అత్యధికంగా దిగుమతి చేసుకున్న సంస్థగా హైదరాబాద్కి చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ రికార్డు నెలకొల్పింది. ఈ విషయంలో వరుసగా రెండోసారీ ఫస్ట్ ప్లేసులో నిలిచి అవార్డు గెలుచుకుంది. ఈ విషయాన్ని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ చౌదరి వెల్లడించారు. జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ను గతంలో జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్గా వ్యవహరించేవారు.
‘వొడాఫోన్’లో అమెరికా సంస్థకు వాటా!
వొడాఫోన్ గ్రూప్లోని వైర్లెస్ టవర్స్ యూనిట్లో వాటా కొనుగోలు చేసే రేసులో అమెరికన్ టవర్ కార్పొరేషన్ నిలిచినట్లు తెలుస్తోంది. ఈ షేర్ విలువ 12 పాయింట్ 6 బిలియన్ డాలర్లు అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రాంక్ఫర్ట్ లిస్టెడ్ వాంటేజ్ టవర్స్ ఏజీలోని దాదాపు 82 శాతం వాటాను అమ్మాలని వొడాఫోన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో ఈ పోటీలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థలైన కేకేఆర్ అండ్ కంపెనీ, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ మరియు EQT AB ఇప్పటికే నిలిచాయి.
10 నెలల కనిష్టానికి ఆయిల్ డిమాండ్
మన దేశంలో నెల వారీ ఇంధనం డిమాండ్ సెప్టెంబర్లో 10 నెలల కనిష్టానికి పడిపోయింది. 2021 నవంబర్ తర్వాత ఇంత తక్కువ గిరాకీ నెలకొనటం ఇదే తొలిసారని గవర్నమెంట్ డేటా వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టుతో పోల్చితే సెప్టెంబర్లో టోటల్ మంత్లీ డిమాండ్ 3 పాయింట్ 6 శాతం తగ్గింది. గతేడాది సెప్టెంబర్లో ఇంధన గిరాకీ 8 పాయింట్ 1గా నమోదైంది. రిఫైనరీల సీజనల్ మెయింటనెన్స్ వల్లే చమురుకు డిమాండ్ తగ్గింది తప్ప ఎకానమీకి దీనికి ఏమాత్రం సంబంధం లేదని చికాగోలోని ప్రైస్ ఫ్యూచర్స్ గ్రూప్ అనలిస్ట్ తెలిపారు.
దిగొచ్చిన ఓలా, ఉబర్.. రేట్ల తగ్గింపు
యాప్ బేస్డ్ మొబిలిటీ సంస్థలైన ఓలా, ఉబర్ ఎట్టకేలకు దిగొచ్చాయి. ఆటో-రిక్షాల సర్వీసుల ఛార్జీలను తగ్గించాయి. టూమచ్గా ఛార్జీలను వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ సర్వీసులను ఇల్లీగల్గా ప్రకటించింది. ఓలా, ఉబర్తోపాటు ర్యాపిడో ఆటోరిక్షా సేవలను కూడా బెంగళూరులో మూడు రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయా కంపెనీలకి నోటీసులను జారీ చేసింది. దీంతో అవి తమ తప్పు తెలుసుకొని దారికొచ్చాయనే టాక్ వినిపిస్తోంది.
మెటావర్స్ యాప్కి మెనీ ప్రాబ్లమ్స్
మార్క్ జుకర్బర్గ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెటావర్స్ యాప్కి పెద్దఎత్తున క్వాలిటీ సమస్యలతోపాటు పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఎదురవుతున్నట్లు ఆ సంస్థలో ఇంటర్నల్గా సర్క్యులేట్ అవుతున్న మెమోలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఆ యాప్ని.. డెవలప్ చేస్తున్నవాళ్లు మరియు మెటావర్స్ కంపెనీ ఉద్యోగులే వాడట్లేదని అంటున్నారు. ఈ ఏడాది చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, మరింత మంది యూజర్లు యాక్సెస్ పొందే లోపు లోటుపాట్లను సరిచేస్తామని పేర్కొంటున్నారు.
ఐడీబీఐలో మెజారిటీ వాటా విక్రయానికి
వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఐడీబీఐ బ్యాంక్లోని మెజారిటీ వాటాను విక్రయానికి పెడుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బిడ్లను ఆహ్వానించింది. ఎల్ఐసీతో కలిసి జాయింట్గా 60 పాయింట్ 7 శాతం వాటాను అమ్మేస్తారు. ఇందులో ఎల్ఐసీకి 49 పాయింట్ 2 శాతం షేర్ ఉండగా దాన్ని 19 శాతానికి కుదించుకోనుంది. కేంద్ర ప్రభుత్వానికి 45 పాయింట్ 5 శాతం స్టేక్ ఉండగా దాన్ని 15 శాతానికి తగ్గించుకోనుంది. నిన్న స్టాక్ మార్కెట్ల పనివేళలు ముగిసే సమయానికి ఐడీబీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 45 వేల 913 కోట్ల రూపాయలు కావటం విశేషం.
