Britannia Biscuit: యుద్ధం ఎక్కడో జరుగుతుంటే బిస్కెట్ ధరలు ఇక్కడ పెరగడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, పశ్చిమ ఆసియాలో సాగుతున్న యుద్ధం కారణంగా సప్లై చైన్ దెబ్బతిని ముడి పదార్థాల ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. నిజానికి మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ తాజాగా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఎంత పెరగనుంది? ప్యాకెట్లో ఏ మార్పు రానుందంటే..
బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ రక్షిత్ హర్ గవే తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ ఈ త్రైమాసికం నుంచి ధరలను పెంచే ప్రక్రియను స్టార్ట్ చేయనుంది. రూ.10 పైన ఉన్న ప్యాకెట్ల ధరలను నేరుగా పెంచనున్నారు. చిన్న ప్యాకెట్లు (రూ.5, రూ.10) సామాన్యులకు భారం కాకుండా ఉండటానికి ఈ ప్యాకెట్ల ధరను పెంచకుండా, లోపల ఉండే బిస్కెట్ల సంఖ్యను లేదా బరువును తగ్గించనున్నారు.
యుద్ధానికి, బిస్కెట్కు లింక్ ఏంటి..
బిస్కెట్ల తయారీలో వాడే పామ్ ఆయిల్, ప్యాకేజింగ్ మెటీరియల్, రవాణా ఖర్చులు (ఫ్యూయల్) అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిపోయాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల సముద్ర మార్గంలో రవాణా కష్టతరమైంది. దీంతో కంపెనీపై అదనపు భారం పడుతోంది. గోధుమ ధరలు కాస్త తగ్గినా, ఇతర ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని సంస్థ తెలిపింది. హోర్ముజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో బ్రిటానియా అంతర్జాతీయ ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి. దీంతో 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి విదేశాల్లోనూ ధరలు పెంచేందుకు కంపెనీ సిద్ధమైంది. సప్లై చైన్ సమస్యలను అధిగమించేందుకు ఒమన్లోని కొన్ని తయారీ యూనిట్లను తిరిగి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు మారుస్తున్నట్లు సంస్థ తెలిపింది.
పోటీ కంపెనీల ఎత్తుగడలు..
గ్రామీణ మార్కెట్లలో బ్రిటానియాకు ప్రత్యర్థి కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కొన్ని కంపెనీలు రూ.5, రూ.10 ప్యాకెట్లను రూ.4.50, రూ.9 లకే విక్రయిస్తూ రిటైలర్లకు ఎక్కువ మార్జిన్ ఇస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో బ్రిటానియా అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇతర కంపెనీలు తిరిగి తమ సాధారణ ధరలకు రాగానే బ్రిటానియా మళ్లీ పుంజుకుంటుందని కంపెనీ యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే.. ఇప్పటి నుంచి మీరు కొనే బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ అదే ధరకు దొరికినా.. అందులో ఉండే బిస్కెట్లు మాత్రం తక్కువగా ఉండబోతున్నాయి. ఒకవేళ బిస్కెట్లు అంతే ఉండాలంటే, మీరు చెల్లించే ధర పెరుగుతుంది. బ్రిటానియా లాంటి దిగ్గజ సంస్థే ధరలు పెంచడంతో, త్వరలోనే ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
