Airtel: ఎయిర్‌టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..

Airtel (1)

Airtel (1)

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మంగళవారం తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్’ పేరిట ఒక వినూత్న సేవను ప్రారంభించింది. వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేని, అత్యంత నమ్మకమైన కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ఈ సేవను రూపొందించారు. అడ్వాన్స్‌డ్ 5G నెట్‌వర్క్ స్లైసింగ్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ సేవను భారత్‌లో ప్రవేశపెట్టిన మొదటి టెలికాం ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది.

నెట్‌వర్క్ స్లైసింగ్ అంటే ఏమిటి?
ఇది ఒక అధునాతన నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్. దీని ద్వారా టెలికాం ఆపరేటర్లు ఒకే ఫిజికల్ నెట్‌వర్క్‌ను ఒకటి కంటే ఎక్కువ వర్చువల్ నెట్‌వర్క్‌లుగా విభజించగలరు. దీనివల్ల ప్రతి వినియోగదారుడికి నెట్‌వర్క్‌ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ‘ఫాస్ట్‌లేన్ కనెక్టివిటీ’ అందుబాటులో ఉంటుంది.

సాధారణంగా జనాభా ఎక్కువగా ఉండే మార్కెట్లు లేదా ట్రాఫిక్ జామ్‌లలో నెట్‌వర్క్ సిగ్నల్ పడిపోతుంటుంది. కానీ.. ఈ సేవ ద్వారా వినియోగదారులు ఎంతటి రద్దీ వాతావరణంలో ఉన్నా కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ వినియోగంలో ఎలాంటి నెట్‌వర్క్ డ్రాప్స్ ఎదుర్కోరు. ఈ మొబైల్-ఓన్లీ సర్వీస్ అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఆటోమేటిక్‌గా ఈ కొత్త సేవకు అప్‌గ్రేడ్ అవుతారు. రూ. 449 ప్రారంభ ధర కలిగిన ఇండివిడ్యువల్ ప్లాన్‌తో సహా అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై ఇది వర్తిస్తుంది. అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్, 3,000 SMSలతో పాటు ఫ్రాడ్ డిటెక్షన్, స్పామ్ అలర్ట్ వంటి సాధారణ ప్రయోజనాలు కూడా ఇందులో లభిస్తాయి.

యాక్సెస్ ఎలా పొందాలి?
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు లేదా కొత్తగా ఈ సేవలోకి మారాలనుకునే వారు ‘ఎయిర్‌టెల్ థాంక్స్’ యాప్ ద్వారా లేదా సమీపంలోని రిటైల్ స్టోర్‌లను సందర్శించి పోస్ట్‌పెయిడ్‌కు మారవచ్చు. అయితే.. ఈ ప్రయారిటీ సేవలు కేవలం ‘5G స్టాండ్‌అలోన్’ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే పనిచేస్తాయి.

“ట్రాఫిక్‌లో క్లయింట్ కాల్స్ మాట్లాడినా, రద్దీగా ఉండే ప్రదేశాల్లో స్ట్రీమింగ్ చేసినా.. మార్కెట్‌లో క్యాబ్ బుక్ చేసుకున్నా వినియోగదారులకు అత్యుత్తమ నెట్‌వర్క్ అనుభూతిని అందించడమే మా లక్ష్యం” అని ఎయిర్‌టెల్ ఇండియా ఎండి అండ్ సీఈఓ శాశ్వత్ శర్మ పేర్కొన్నారు.