Navagraha Pradakshina: ఆలయాలలో నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత కాళ్లు కడుక్కోవాలనే నియమం వెనుక రకరకాల భయాలు, అపోహలు మనం వింటూనే ఉంటాము. అందులో ముఖ్యంగా.. నవగ్రహాలు అంటే దుష్ట గ్రహాలని, వాటిని పూజిస్తే కష్టాలు చుట్టుకుంటాయని కొందరు అనుకుంటుంటారు. అయితే, ఏ శాస్త్రంలోనూ నవగ్రహాలు భక్తులను పీడించే దుష్ట గ్రహాలని చెప్పలేదు. నవగ్రహాలన్నీ భక్తుల శ్రేయస్సును కాంక్షించే దేవతా స్వరూపాలే..
కాళ్లు కడుక్కోవాలనే నియమం..
నవగ్రహ మండపంలో ఉన్న తొమ్మిది గ్రహాలలో రాహు, కేతువులు ఛాయాగ్రహాలుగా, రాక్షస నేపథ్యం కలిగినవిగా పరిగణించబడతాయి. ఇతర గ్రహాలకు సవ్య దిశలో (క్లాక్వైజ్) పూజలు నిర్వహిస్తే, రాహు-కేతువులకు అపసవ్య దిశలో (యాంటీ-క్లాక్వైజ్) ప్రదక్షిణలు లేదా పూజలు చేయడం జరుగుతుంది. ఈ గ్రహాల ద్వారా వచ్చే ప్రతికూల శక్తులు (నెగెటివిటీ) మనపై ప్రభావం చూపకుండా ఉండేందుకు, అలాగే ఇంటికి ఆ నెగెటివ్ ప్రభావం చేరకుండా ఉండేందుకు మాత్రమే ప్రదక్షిణల అనంతరం కాళ్లు కడుక్కోవాలని పెద్దలు చెబుతుంటారు.
ఆలయ దర్శనంలో పాటించాల్సిన సరైన పద్ధతి:
గుడికి వెళ్లినప్పుడు దైవ దర్శనాన్ని ఒక నిర్దిష్టమైన క్రమంలో పూర్తి చేయాలి. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే సర్వ విఘ్నాలు తొలగిపోవడానికి ముందుగా గణపతిని దర్శించుకోవాలి. ఆ తర్వాత ఆలయంలోని ప్రధాన మూలవిరాట్ (శివాలయంలో శివుడు, వైష్ణవాలయంలో వెంకటేశ్వర స్వామి లేదా ఇతర ప్రధాన దేవతలు) వద్దకు వెళ్లి నమస్కరించుకుని, సంకల్పం ప్రకారం ఆలయ ప్రదక్షిణలు పూర్తి చేయాలి.
నవగ్రహ పూజా విధానం..
ప్రధాన దైవ దర్శనం, ప్రదక్షిణలు పూర్తయిన తర్వాతే నవగ్రహ మండపానికి వెళ్లాలి. జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు ఉన్నప్పుడు లేదా గురువుల సూచనల మేరకు, భక్తులు నిర్దేశిత సంఖ్యలో నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. ఈ క్రమాన్ని పాటిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించినప్పుడే గ్రహ దోషాలు తొలగి సంపూర్ణ దైవానుగ్రహం కలుగుతుంది.

