Site icon NTV Telugu

Mahashivratri 2026: ‘మహాశివరాత్రి’ వ్రత మహిమ.. ఉపవాసం, జాగరణ తప్పక ఉండాల్సిందేనా?

Shivratri Fasting And Jagaran

Shivratri Fasting And Jagaran

‘మహాశివరాత్రి’.. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించబడుతుంది. ఈ రోజు పరమేశ్వరుని ఆరాధనకు ప్రత్యేకంగా కేటాయించబడింది. శివరాత్రి వ్రతంలో ముఖ్యంగా రెండు అంశాలు ప్రధానంగా చెప్పబడుతాయి. మొదటిది ఉపవాసం, రెండవది జాగరణ. ఈ రెండు సాధనాలు శరీరం, మనస్సు, ఆత్మను పవిత్రం చేస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తాయి. నేడు మహాశివరాత్రి (ఫిబ్రవరి 15).

ఉపవాసం అంటే ఏమిటి?:
శాస్త్రాల్లో ‘ఆహార నివృత్తిః ఉపవాసః’ అని ఉపవాసానికి నిర్వచనం. అంటే ఆహారాన్ని తినకుండా ఉండడమే ఉపవాసం. అయితే ఇది కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాదు.. ఇంద్రియ నియంత్రణ, మనస్సు ఏకాగ్రత, దైవచింతన కలయికే నిజమైన ఉపవాసం. ప్రతి ఒక్కరి శారీరక స్థితి వేరు కాబట్టి.. అందుకు అనుగుణంగా ఆచరించాలి. శరీరం సహకరించని వారు అల్పమైన, సాత్త్వికమైన, శుద్ధమైన ఆహారాన్ని స్వీకరించవచ్చు. శరీరం సహకరిస్తే మాత్రం పూర్ణ ఉపవాసం చేయడం ఉత్తమం.

జాగరణ తాత్త్విక అర్థం:
శివరాత్రి వ్రతంలో రెండవ ముఖ్యమైన అంశం జాగరణ. జాగరణ అంటే నిద్ర లేకుండా ఉండటం మాత్రమే కాదు.. దైవ ధ్యానం, జపం, భజనలు చేస్తూ రాత్రంతా పరమేశ్వరుని స్మరించటం. శాస్త్రాల ప్రకారం పరమేశ్వరుడు నిత్య జాగరణశీలుడు. ప్రళయకాలంలో సర్వ జగత్తూ నిద్రలోకి జారినా.. ఆయన మాత్రం చైతన్య స్వరూపుడిగా జాగరూకుడిగా ఉంటాడు. ఇది శివుడి జ్ఞానస్వరూపత్వానికి సంకేతం. శరీరం సహకరిస్తే జాగరణ చేయడం ఉత్తమం.

జాగరణ జ్ఞానానికి ప్రతీక:
పరమేశ్వరునికి అజ్ఞానం, మోహం వంటి లక్షణాలు లేవు. అందుకే ఆయనను నిత్యజాగృత చైతన్యంగా వర్ణిస్తారు. శివయ్యను అనుసరించే భక్తుడు కూడా జాగరణ ద్వారా తనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని.. జ్ఞానాన్ని పొందగలడని విశ్వాసం.

వ్రతాచరణ ద్వారా లభించే ఫలితాలు:
ఉపవాసం ద్వారా శరీరం శుద్ధి, జాగరణ ద్వారా మనస్సు శుద్ధి కలుగుతాయని ఆధ్యాత్మిక వేదాంతం చెబుతుంది. ఈ రెండు కలిసి భక్తుడిని దైవ చైతన్యానికి దగ్గర చేస్తాయి. శివరాత్రి రోజున ఈ విధంగా ఉపవాసం, జాగరణతో పరమేశ్వరుని ఆరాధించిన వారు ఆధ్యాత్మికంగా ధన్యులవుతారని భక్తుల నమ్మకం.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది)

Exit mobile version