Maha Shivaratri 2026: ముక్కంటి అనుగ్రహం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురుచూసే మహాశివరాత్రి పర్వదినం రానే వచ్చింది. ఈ పవిత్ర రోజున ఉపవాస జాగరణలతో ఆ భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ తపిస్తుంటారు. అయితే, కేవలం ఉపవాసం ఉండటమే కాకుండా, మహాశివరాత్రి రోజున పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు, చేయకూడని తప్పుల గురించి ఆధ్యాత్మిక నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: AUS vs ZIM: టీ20 ప్రపంచకప్లో సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాంబ్వే విజయం!
1. వాక్ శుద్ధి – మనః శుద్ధి
శివరాత్రి రోజున భక్తులు పాటించాల్సిన మొదటి నియమం అసత్యం ఆడకపోవడం. అబద్ధాలకు దూరంగా ఉంటూ, మనసులో ఎలాంటి క్రోధావేశాలకు తావు ఇవ్వకూడదని ఆధ్యాత్మిక నిపుణులు పేర్కొంటున్నారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అత్యంత ప్రశాంతంగా ఉండాలని అన్నారు. విశేషమేమిటంటే, ఈ రోజున ఎవరిని పలకరించినా ‘శివ శివ’ అంటూ సంబోధించడం వల్ల శివానుగ్రహం లభిస్తుందని శాస్త్రం చెబుతోందన్నారు.
2. వస్త్రధారణ & విభూతి ప్రాశస్త్యం
పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రంగు తెలుపు. కాబట్టి భక్తులు తెల్లని వస్త్రాలు ధరించి పూజలో పాల్గొనడం శ్రేయస్కరం అంటున్నారు. అలాగే, శివరాత్రి నాడు భస్మ ధారణకు విశిష్ట స్థానం ఉందన్నారు.
పురుషులు: తడి విభూతిని నుదుట, వక్షస్థలం, భుజాలపై ధరించాలని సూచించారు.
స్త్రీలు: పొడి విభూతిని ధరించాలని శివమహాపురాణం పేర్కొంటోందని వెల్లడించారు.
3. పార్థివ లింగ పూజ – మంత్ర సాధన
మహాశివరాత్రి నాడు చేసే అన్ని పూజల్లో కల్లా పార్థివ లింగ పూజ (మట్టితో చేసిన లింగం) అత్యుత్తమమైనదని చెప్పారు. మట్టిలో కొద్దిగా ఆవుపేడ కలిపి లింగాన్ని చేసి పూజించడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుందన్నారు. ఆ రోజు చేసే మంత్రోచ్ఛారణ విషయంలోనూ చిన్న మార్పులు చేయాలన్నారు.
పురుషులు: ‘నమః శివాయ’ అని జపించాలన్నారు.
స్త్రీలు: ‘శివాయ నమః’ అని స్మరించుకోవడం వల్ల త్వరితగతిన ఫలితం దక్కుతుందని చెప్పారు.
4. ఉపవాసం అంటే..
ఆహారం మానేయడమే ఉపవాసం అని చాలామంది భావిస్తారు. కానీ, ‘ఉప’ అంటే దగ్గరగా, ‘వాసం’ అంటే ఉండటం.. అంటే శివుడికి దగ్గరగా ఉండటమే నిజమైన ఉపవాసం. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, గర్భిణులు, 12 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు కఠిన ఉపవాస నియమాలు వర్తించవని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటూ చేసే ఉపవాసం కంటే, మనసును శివుడిపై లగ్నం చేయడం మిన్న అని చెప్పారు.
5. జాగరణ అంటే వినోదం కాదు..
చాలామంది శివరాత్రి జాగరణ పేరుతో సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. కానీ నిజమైన జాగరణ అంటే ఆధ్యాత్మిక విషయాల్లో మేలుకోవడం అన్నారు. ప్రాపంచిక కోరికలు, ఇంద్రియ సుఖాల విషయంలో నిద్రపోతూ (నిగ్రహం పాటిస్తూ), జ్ఞాన మార్గంలో మేల్కొనడమే అసలైన శివరాత్రి జాగరణ అని ఆధ్యాత్మిక వేత్తలు స్పష్టం చేశారు. ఈ నియమాలను భక్తిశ్రద్ధలతో పాటించి, ఆ మహాదేవుని కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని భక్తులకు సూచించారు.
READ ALSO: IND Playing 11 vs PAK: సంజు, రింకు అవుట్.. సర్ప్రైజ్ ఎంట్రీ, పాకిస్థాన్పై ఆడే భారత్ తుది జట్టు ఇదే!
