Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే

Guru Purnima

Guru Purnima

Guru Purnima 2026: అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపించే దైవస్వరూపంగా హిందూ సంప్రదాయం గురువును భావిస్తుంది. అందుకే ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకునే గురు పౌర్ణమికి విశేష ప్రాధాన్యం ఉంది. ఈ పవిత్రమైన రోజున గురువులను స్మరించి, వారి ఆశీర్వాదాలు పొందడం శుభప్రదంగా భావిస్తారు. అయితే 2026లో గురు పౌర్ణమి జూలై 28న వస్తుందా? లేక జూలై 29న జరుపుకోవాలా? అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే హిందూ పంచాంగం ప్రకారం 2026లో ఆషాఢ పౌర్ణమి తిథి జూలై 28 సాయంత్రం 6:21 గంటలకు ప్రారంభమై, జూలై 29 రాత్రి 8:07 గంటలకు ముగుస్తుంది. జూలై 28న సూర్యోదయ సమయంలో పౌర్ణమి తిథి కొనసాగుతున్న కారణంగా గురు పౌర్ణమి పండుగను జూలై 29, 2026న నిర్వహించడం శాస్త్రోక్తంగా భావిస్తున్నారు.

గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం మహర్షి వేదవ్యాసుడు ఈ రోజునే జన్మించారు. వేదాలను విభజించి, మహాభారతం, పురాణాలను ఆవిష్కరించడం ద్వారా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి అపూర్వమైన సేవలు అందించిన వేదవ్యాస మహర్షిని ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. అలాగే ఈ పౌర్ణమితో ఆషాఢ మాసం ముగిసి, శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది.

ఈసారి గురు పౌర్ణమి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ రోజున ప్రీతి యోగం, హర్షణ యోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు శుభయోగాలు రోజంతా ప్రభావవంతంగా ఉండనున్నట్లు పంచాంగ నిపుణులు చెబుతున్నారు. ప్రీతి యోగం ప్రేమ, సామరస్యం, సానుకూలతకు సంకేతంగా భావిస్తారు. హర్షణ యోగం ఆనందం, విజయం, శుభ ఫలితాలను ప్రసాదించే యోగంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ రోజున గురుపూజ, దానధర్మాలు, జపధ్యానాలు చేయడం మరింత శుభప్రదంగా భావిస్తారు.

గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా స్థలాన్ని పరిశుభ్రంగా అలంకరించి తెల్లని వస్త్రం పరచి వ్యాస పీఠాన్ని సిద్ధం చేయాలి. అనంతరం మహర్షి వేదవ్యాసుడి చిత్రంలేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి చందనం, కుంకుమ, పుష్పాలు, పండ్లు, నైవేద్యాలతో భక్తిశ్రద్ధలతో పూజించాలి. వేదవ్యాస మహర్షితో పాటు ఆది శంకరాచార్యులు, శుక్రాచార్యులు వంటి మహనీయ గురువులను స్మరించుకోవడం కూడా శుభప్రదంగా భావిస్తారు.

గురు పౌర్ణమి ఆధ్యాత్మిక గురువులకు మాత్రమే అంకితమైన రోజు కాదు. మన జీవితానికి దారి చూపిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు, మార్గదర్శకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన సందర్భం కూడా. ఈ రోజున వారి ఆశీర్వాదాలు తీసుకోవడం, సాధ్యమైనంత మేరకు దానధర్మాలు చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా గురు పౌర్ణమి పర్వదినాన్ని మరింత సార్థకం చేసుకోవచ్చు.