Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi 2026: భారతదేశమంతటా ఎంతో వైభవంగా జరుపుకొనే గణేష్ చతుర్థి వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పండగ కోలాహలం, భక్తుల ఉత్సాహం వేరే స్థాయిలో ఉంటుంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథితో ఈ పది రోజుల గణేశోత్సవాలు ప్రారంభమవుతాయి. మన ఇళ్లలోకి ఆ గణపతి బప్పాను ఆహ్వానించడానికి భక్తులంతా చాలా ఆతురుతతో ఎదురుచూస్తుంటారు. అయితే, ఈసారి వినాయక చతుర్థి సెప్టెంబర్ 14న వస్తుందా లేక 15న వస్తుందా అనే చిన్నపాటి అయోమయం అందరిలోనూ నెలకొంది. ఈ తిథి విషయంలో ఉన్న సందేహాన్ని నివృత్తి చేసుకుంటే, హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది భాద్రపద శుక్ల చతుర్థి తిథి సెప్టెంబర్ 14, 2026 సోమవారం ఉదయం 07:06 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 15, 2026 మంగళవారం ఉదయం 07:44 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయ తిథి (ఉదయ తిథి) నియమాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వినాయక చతుర్థి పండగను సెప్టెంబర్ 14, 2026 సోమవారం రోజే జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.

ఇక స్వామివారి విగ్రహ స్థాపన సమయాన్ని పరిశీలిస్తే, వినాయకుని ప్రతిష్టాపన ఎప్పుడూ మధ్యాహ్న కాలంలోనే చేయడం అత్యంత శుభప్రదం. ఎందుకంటే పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య మధ్యాహ్న సమయంలోనే జన్మించాడు. అందుకే సెప్టెంబర్ 14న ఉదయం 11:02 గంటల నుంచి మధ్యాహ్నం 01:31 గంటల వరకు గణపతి పూజకు, విగ్రహ స్థాపనకు అత్యంత శుభ ముహూర్తంగా నిర్ణయించారు. ఇక, బప్పాను పూజించేందుకు చాలా సరళమైన విధివిధానాలు ఉన్నాయి. పండగ రోజు ఉదయమే లేచి, స్నానాదికాలు ముగించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంట్లోని ఈశాన్య కోణంలో లేదా తూర్పు దిశలో ఒక చెక్క పీటను ఉంచి, దానిపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరవాలి. అక్షతలతో అష్టదళ కమలం వేసి, దానిపై కొత్త వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. పూజ చేసే సమయంలో మన ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత చేతిలో నీరు, అక్షతలు, పువ్వులు తీసుకుని వ్రత సంకల్పం చెప్పుకొని, “ఓం గం గణపతయే నమః” అనే మంత్రంతో స్వామివారిని ఆహ్వానించాలి.

విగ్రహంపై ప్రతీకాత్మకంగా నీరు, పంచామృతాలు చల్లాలి. అనంతరం రోలి, చందనం, అక్షతలు, జంద్యం, ఎర్రటి వస్త్రం, తాజా పూలను స్వామికి సమర్పించాలి. గణనాథునికి ఎంతో ప్రీతిపాత్రమైన 21 గరిక పోచల జతలను (దూర్వా) సమర్పించాలి, అయితే గరికను స్వామివారి పాదాల దగ్గర కాకుండా శిరస్సుపై ఉంచాలనే విషయం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత బప్పాకు ఇష్టమైన 21 మోదకాలు లేదా లడ్డూలతో పాటు రకరకాల పండ్లను నైవేద్యంగా పెట్టాలి. ధూపదీపాలు వెలిగించి, భక్తిశ్రద్ధలతో హారతి ఇచ్చి, పూజలో తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకోవాలి. ఇలా సెప్టెంబర్ 14న అట్టహాసంగా ప్రారంభమయ్యే ఈ పది రోజుల మహోత్సవం అనంత చతుర్దశి రోజుతో పూర్తవుతుంది. భక్తులందరూ అత్యంత భక్తిప్రపత్తులతో జరుపుకునే ఈ గణేష్ ఉత్సవాల ముగింపుగా, సెప్టెంబర్ 25, 2026 శుక్రవారం నాడు స్వామివారి నిమజ్జనం ఘనంగా జరుగుతుంది.