Adhika Masa Purnima: జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ప్రతి మూడేళ్లకోసారి వచ్చే అధిక మాస పౌర్ణమికి ఆధ్యాత్మికంగా మరింత విశిష్ట స్థానం ఉంది. ఈ పవిత్ర తిథి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు నదీ స్నానాలు, దాన కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు.
తిథి వేళల వివరాలు ఇవే..
క్యాలెండర్ ప్రకారం.. పౌర్ణమి తిథి మే 30వ తేదీ (నిన్న) ఉదయం 11:57 గంటలకే ప్రారంభమైంది. ఇది ఈరోజు (మే 31) మధ్యాహ్నం 2:14 గంటల వరకు కొనసాగుతుంది. ఈ రోజు సూర్యోదయంతో పౌర్ణమి తిథి కూడి ఉండటంతో, స్నాన – దాన కార్యక్రమాలకు ఈ రోజే అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
స్నానాలకు శుభ ముహూర్తాలు..
పౌర్ణమి రోజున నదీ స్నానానికి బ్రహ్మ ముహూర్తం అత్యంత శ్రేష్ఠమైనదిగా చెబుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4:03 గంటల నుంచి 4:43 గంటల వరకు ఉన్న బ్రహ్మ ముహూర్తంలో భక్తులు గంగానదితో పాటు ఇతర పవిత్ర నదులలో పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే తెల్లవారుజామున 4:33 గంటలకు స్టార్ట్ అయిన అమృత కాలం ఉదయం 6:20 గంటల వరకు కొనసాగింది. ఈ సమయంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో స్నానాలు చేశారు. ఒకవేళ ఉదయం స్నానం చేయలేకపోయిన వారు.. మధ్యాహ్నం 11:57 గంటల నుంచి 12:51 గంటల వరకు ఉండే అభిజిత్ ముహూర్తంలో కూడా పవిత్ర స్నానాలు ఆచరించవచ్చని చెబుతున్నారు.
దానాలు చేయడానికి ఉత్తమ సమయం ఇదే
అధిక మాస పౌర్ణమి రోజున దానధర్మాలు చేయడం వల్ల అనంత కోటి పుణ్యఫలాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజు దానం చేయడానికి ఉదయం 8:51 గంటల నుంచి 10:35 గంటల మధ్య సమయం అత్యంత అనుకూలమైనదిగా నిర్ణయించారు. ఈ పవిత్ర దినాన మీ శక్తి సామర్థ్యాల మేరకు ఈ వస్తువులను దానం చేయడం శుభప్రదం అని జ్యోతిష్యులు అన్నారు. బియ్యం, పప్పులు, పిండి, బెల్లం, నెయ్యి, పాలు, మామిడి పండ్లు లేదా అరటిపండ్లు, దుస్తులు, గొడుగు, నీటితో నింపిన మట్టి కుండ.
అధిక మాస పౌర్ణమి ప్రాముఖ్యత ఇదే..
హిందూ పురాణాల ప్రకారం.. అధిక మాసానికి అధిపతి శ్రీమహావిష్ణువు. అందుకే ఈ మాసానికి ఆయన తన పేరైన ‘పురుషోత్తమ మాసం’ అని నామకరణం చేశారు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కాలంలో చేసే స్నానం, జపం, తపస్సు, పూజలు, దానధర్మాలకు సాధారణ రోజుల కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు.
