Car Sales in August: పరిస్థితులకు అనుగుణంగా.. వినియోగదారుల ఎంపిక మారుతూనే ఉంటుంది.. ఇప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో వినియోగదారుల ఇంధన ఎంపికలు వేగంగా మారుతున్నాయి. ఆగస్టులో దేశవ్యాప్తంగా 4.01 లక్షలకు పైగా ప్యాసింజర్ వాహనాలు విక్రయమయ్యాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే కార్ల రిటైల్ అమ్మకాలు 16 శాతం పెరిగాయి. అయితే, కార్ల కొనుగోలులో పెట్రోల్పై ఆధారపడే వినియోగదారుల సంఖ్య తగ్గుతున్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ఆగస్టులో పెట్రోల్ కార్ల మార్కెట్ వాటా రికార్డు స్థాయిలో 41 శాతానికి పడిపోవడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.. గతేడాది ఇదే నెలలో ఈ వాటా 46 శాతంగా ఉండేది. మరోవైపు ఇదే సమయంలో.. CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలు కలిపి 42 శాతం మార్కెట్ వాటాను సాధించాయి. దీంతో తొలిసారిగా ఈ మూడు ఇంధన/సాంకేతిక ఎంపికలు కలిపి పెట్రోల్ కార్ల వాటాను వెనక్కి నెట్టాయి..
రికార్డు స్థాయికి CNG కార్ల వాటా
CNG కార్లకు వినియోగదారుల నుంచి భారీగా ఆదరణ లభిస్తోంది. ఆగస్టులో ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో CNG వాటా 25 శాతానికి చేరింది. గతేడాది ఇదే నెలలో ఇది 21 శాతంగా ఉంది. పెట్రోల్తో పోలిస్తే తక్కువ నిర్వహణ వ్యయం, పెరుగుతున్న CNG మోడళ్ల సంఖ్య దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. CNG విభాగంలో మారుతి సుజుకి ఆధిపత్యం కొనసాగుతోంది. దేశంలో విక్రయమైన CNG కార్లలో మారుతి సుజుకి వాటా సుమారు 71 శాతంగా ఉంది. టాటా మోటార్స్ 17 శాతం, హ్యుందాయ్ 9 శాతం మార్కెట్ వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వినియోగదారుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని కంపెనీలు CNG మోడళ్లను తీసుకొస్తున్నాయి. కియా ఇండియా కూడా కేరెన్స్ CNGతో ఈ విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
డీజిల్కు ఇంకా డిమాండ్
అయితే, డీజిల్ కార్ల మార్కెట్ వాటా ఆగస్టులో సుమారు 17 శాతంగా ఉంది. డీజిల్ మోడళ్ల సంఖ్య పరిమితమైనప్పటికీ, ముఖ్యంగా అధిక మైలేజ్, దీర్ఘదూర ప్రయాణాలను కోరుకునే వినియోగదారుల్లో వీటికి ఇప్పటికీ డిమాండ్ కొనసాగుతోంది.
EV అమ్మకాల్లో 52 శాతం వృద్ధి
ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు కూడా ఆగస్టులో గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే EV అమ్మకాలు 52 శాతం వృద్ధి చెంది సుమారు 30,700 యూనిట్లకు చేరుకున్నాయి. ప్యాసింజర్ వాహన మార్కెట్లో EVల వాటా గతేడాది 5.9 శాతం నుంచి ఈ ఏడాది 7.7 శాతానికి పెరిగింది. జూలైలో నమోదైన 8.1 శాతం కంటే కొద్దిగా తక్కువైనా, ఆగస్టు EV విక్రయాలకు మూడో అత్యుత్తమ నెలగా నిలిచింది. EV మార్కెట్లో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ మార్కెట్ వాటా సుమారు 43 శాతానికి చేరుకుంది. డిసెంబర్ 2025 తర్వాత టాటా మోటార్స్ సాధించిన అత్యధిక EV మార్కెట్ వాటా ఇదే.
మారుతున్న భారతీయ కార్ల కొనుగోలు ధోరణి
మొత్తంగా ఆగస్టు గణాంకాలు భారతీయ కార్ల మార్కెట్లో కీలక మార్పును సూచిస్తున్నాయి. పెట్రోల్ ఇప్పటికీ అతిపెద్ద వ్యక్తిగత ఇంధన ఎంపికగా ఉన్నప్పటికీ, అది ఇకపై ఏకైక డిఫాల్ట్ ఎంపికగా కనిపించడం లేదు. CNG, హైబ్రిడ్, EVల వైపు వినియోగదారులు మళ్లుతున్నారు. పెరుగుతున్న ఇంధన వ్యయాలు, నిర్వహణ ఖర్చులు, మైలేజ్, కొత్త సాంకేతికతలు, పర్యావరణ అంశాలు భవిష్యత్తులో కార్ల కొనుగోలు నిర్ణయాలను మరింతగా ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు..

