7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!

  • మహీంద్రా XEV 9Sలో కొత్త 6-సీటర్ వేరియంట్‌
  • కొత్త మోడల్‌లో 7-సీటర్ బెంచ్ సీటు స్థానంలో..
  • 2+2+2 లేఅవుట్‌తో క్యాప్టెన్ సీట్లు..
Mahindra Xev 9s

Mahindra Xev 9s

Mahindra XEV 9S: మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XEV 9Sలో కొత్త 6-సీటర్ కాన్ఫిగరేషన్‌ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఉన్న రెండో వరుస బెంచ్ సీటు స్థానంలో ప్రత్యేకమైన క్యాప్టెన్ సీట్లను తీసుకొచ్చింది. దీంతో వెనుక వరుసలో ప్రయాణించే వారికి మరింత ప్రీమియం, సౌకర్యవంతమైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. కొత్త 2+2+2 సీటింగ్ లేఅవుట్.. “ప్యాక్ టు అబోవ్, ప్యాక్ త్రీ, ప్యాక్ త్రీ అబోవ్” అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే సీటింగ్ లేఅవుట్‌లో మార్పు చేసినప్పటికీ.. XEV 9S ఫీచర్లు, బ్యాటరీ ఆప్షన్లు, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

కొత్త 6-సీటర్ వెర్షన్‌లో రెండో వరుసలో రెండు ప్రత్యేక క్యాప్టెన్ సీట్లు ఉంటాయి. వీటికి ప్రత్యేక ఆర్మ్‌రెస్టులు అందించారు. అంతేకాకుండా రెండు సీట్ల మధ్య వాక్-త్రూ ప్యాసేజ్ ఉండటంతో మూడో వరుసకు వెళ్లడం మరింత సులభంగా ఉంటుంది. రియర్ ఏసీ వెంట్స్, 65W USB ఛార్జింగ్ పోర్ట్స్ వంటి ఫీచర్లు యథావిధిగా కొనసాగుతాయి. పెద్ద కుటుంబాలతో ప్రయాణించేవారితో పాటు రెండో వరుసలో ఎక్కువ వ్యక్తిగత స్థలం, సౌకర్యం కోరుకునే కస్టమర్లను ఈ కొత్త కాన్ఫిగరేషన్ ఆకట్టుకునే అవకాశం ఉంది.

మహీంద్రా XEV 9Sలో ఇప్పటికే ఉన్న ప్రీమియం ఫీచర్లు కొత్త 6-సీటర్ వెర్షన్‌లోనూ కొనసాగుతాయి. ఇందులో మూడు 12.3 అంగుళాల డిస్‌ప్లేలు, VisionX ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే, Level 2+ ADAS, 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. అంతేకాకుండా ముందు, వెనుక సీట్లకు వెంటిలేషన్, ఎత్తైన వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. XEV 9S మహీంద్రా INGLO ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందింది. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఎంట్రీ లెవల్ వేరియంట్‌లో 59kWh బ్యాటరీతో 228 bhp ఎలక్ట్రిక్ మోటార్, 380Nm టార్క్ లభిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 521 కి.మీ. వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే మరోవైపు 79kWh బ్యాటరీ వేరియంట్ 281 bhp పవర్, 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వెర్షన్ గరిష్టంగా 679 కి.మీ. రేంజ్‌ను అందిస్తుంది.

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మహీంద్రా వేగంగా తన వాటాను పెంచుకుంటోంది. 2026 తొలి ఆరు నెలల్లో దేశంలోని టాప్ మూడు ఈవీ తయారీదారుల్లో మహీంద్రా అత్యంత వేగంగా వృద్ధి సాధించిన కంపెనీగా నిలిచింది. ఈ కాలంలో కంపెనీ ఈవీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 147% పెరిగి 34,131 యూనిట్లకు చేరుకున్నాయి. దీంతో మహీంద్రా ఈవీ మార్కెట్ వాటా 17% నుంచి 23%కి పెరిగింది. మార్చి 2026లో JSW MG మోటార్‌ను అధిగమించిన మహీంద్రా.. 2026 తొలి అర్ధభాగంలో రెండో స్థానాన్ని కొనసాగించింది. కంపెనీకి చెందిన కొత్త తరం ఎలక్ట్రిక్ మోడళ్లకు పెరుగుతున్న డిమాండ్ ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.

మహీంద్రా XEV 9S కొత్త 6-సీటర్ వెర్షన్ ధరలు సంబంధిత 7-సీటర్ వేరియంట్ల కంటే రూ.25,000 అధికంగా ఉన్నాయి. ఈ కొత్త సీటింగ్ కాన్ఫిగరేషన్ ధరలు రూ.25.25 లక్షల నుంచి రూ.30.15 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.