Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!

  • భారత్‌లో Jeep Compass 85th Anniversary Edition లాంచ్
  • రూ.26.70 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర
  • కేవలం 85 యూనిట్లకు మాత్రమే పరిమితం
  • ప్రత్యేకమైన 18 అంగుళాల గ్లోస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్
  • 85వ వార్షికోత్సవ ప్రత్యేక బ్యాడ్జింగ్, డిజైన్ ఎలిమెంట్స్..
Jeep Compass 85th Anniversary Edition

Jeep Compass 85th Anniversary Edition

Jeep Compass 85th Anniversary Edition: భారత్‌లో ప్రీమియం ఎస్‌యూవీ బ్రాండ్ జీప్ (Jeep) 85వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కంపాస్ 85th యానివెర్సరీ ఎడిషన్ (Compass 85th Anniversary Edition)ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కేవలం 85 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. సాధారణ కంపాస్‌తో పోలిస్తే ప్రత్యేకమైన ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్‌తో పాటు అదనపు ఫీచర్లు, వ్యక్తిగతీకరణ ప్యాకేజీని ఇందులో అందించారు.

ఎక్స్‌టీరియర్ డిజైన్:

ఈ కొత్త ఎడిషన్ ను స్టాండర్డ్ మోడల్ నుంచి ప్రత్యేకంగా గుర్తించేందుకు పలు డిజైన్ మార్పులు చేశారు. ఇందులో గ్లోస్ బ్లాక్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అలాగే 85వ వార్షికోత్సవానికి సంబంధించిన ప్రత్యేక బ్యాడ్జింగ్, డిజైన్ ఎలిమెంట్స్‌ను అందించారు. ఇక ఇంటీరియర్‌లో ఆల్-బ్లాక్ థీమ్‌ను ఉపయోగించారు. దీనికి “Mayan Gold accents”తో పాటు ప్రత్యేకమైన 85వ వార్షికోత్సవ ఎలిమెంట్స్‌ను అందించారు. దీంతో కేబిన్‌కు మరింత ప్రీమియం, ప్రత్యేకమైన లుక్ లభిస్తుంది.

AXS ప్యాకేజీ:

ఈ ప్రత్యేక ఎడిషన్తో జీప్ ప్రత్యేక 85th యానివెర్సరీ AXS పర్సనలైజేషన్ ప్యాకేజీను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్లు తమ ఎస్‌యూవీని మరింత వ్యక్తిగతీకరించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీలో Skylounge సన్‌రూఫ్ ఇల్యూమినేషన్, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ ఇన్‌సైడ్ రియర్-వ్యూ మిర్రర్ (IRVM), ఫ్రంట్ & రియర్ డ్యాష్‌క్యామ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి కారు లోపలి వాతావరణాన్ని మరింత ప్రీమియంగా మార్చడంతో పాటు డ్రైవింగ్ సమయంలో సౌకర్యం, భద్రతను పెంచుతాయి.

జీప్ తన గ్లోబల్ SUV ప్రయాణానికి 85 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. 1941లో విడుదలైన ఐకానిక్ Willys నుంచి జీప్ బ్రాండ్ తన SUV ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి స్వేచ్ఛ, అడ్వెంచర్, ఎక్స్‌ప్లోరేషన్ వంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. భారత్‌లోనూ జీప్ ప్రీమియం SUV విభాగంలో కంపాస్ తో పాటు మెరిడియన్, రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ వంటి మోడళ్లను అందిస్తోంది. ఇప్పుడు 85వ వార్షికోత్సవంలో భాగంగా కంపాస్ కు ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకురావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన “డక్ డక్ జీప్” ఉద్యమాన్ని భారత్‌లోనూ ప్రారంభిస్తోంది. దీని ద్వారా జీప్ యజమానులు చిన్న పనులు, కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా ఇతర జీప్ అభిమానులతో కనెక్ట్ అయ్యేలా ప్రోత్సహించనున్నారు.

ధర:

భారత్‌లో జీప్ కంపాస్ 85th యానివెర్సరీ ఎడిషన్ ధర రూ.26.70 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రత్యేకమైన మోడల్‌గా రూపొందించారు. స్టాండర్డ్ కంపాస్‌లోని రోజువారీ వినియోగ సౌకర్యాలు, లాంగ్ డ్రైవ్ కంఫర్ట్, ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కొనసాగిస్తూనే ప్రత్యేక వార్షికోత్సవ టచ్‌ను జోడించారు.