Vijay Sai Reddy: ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే

ఏపీలో డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను అకస్మాత్తుగా బదిలీ చేయడంపై టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నలుగురు డీజీపీలను మార్చినా ఒక్కరూ మాట్లాడలేదని.. జగన్ గారి హయాంలో 30 నెలలుగా డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్‌ను మారిస్తే ఆయనపై ఏదో ప్రేమ ఉన్నట్లు పచ్చ బ్యాబ్ గగ్గోలు పెడుతుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. సవాంగ్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా చేయడంతో పచ్చ మీడియాకు షాక్ తగిలిందని.. ఏరు దాటాక తెప్ప తగలేయడం చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కాగా డీపీజీ గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. గౌతమ్ సవాంగ్‌ బదిలీపై గల కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇటీవల విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్‌పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందని పవన్ స్పష్టం చేసిన విషయం విదితమే.