Andhra Pradesh: పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించింది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ విశాఖలో ఏర్పాటు చేయనుంది. రూ.87,520 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 11వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియచేసింది.. విశాఖలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్లి వద్ద మూడు క్యాంపస్లలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు అనుసంధానంగా ఈ క్యాంపస్లు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల ద్వారా రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 67,218 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
Read Also: Peddi Exclusive :’పెద్ది’ 60 % కంప్లీట్.. రేపటి నుంచి అక్కడ సాంగ్ షూట్!
దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది ఎస్ఐపీబీ సమావేశం.. రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ద్వారా దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఏపీకి సాధించటంపై ఐటీ శాఖామంత్రి నారా లోకేష్కు ముఖ్యమంత్రి, మంత్రులు అభినందనలు తెలియచేశారు. క్వాంటం వ్యాలీ తరహాలోనే డేటా సెంటర్లు ఏపీకి టెక్నాలజీ గేమ్ చేంజర్గా మారతాయని అన్నారు. కేవలం 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డేటా సెంటర్లతో ఓ ఎకో సిస్టం వస్తోందని.. విశాఖ నగరం తదుపరి స్థాయి ఏఐ సిటీగా మారుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యుత్ తక్కువ ధరకు అందిస్తే ఐటీ రంగానికి మేలు జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు జరిగిన 11 ఎస్ఐపీబీల ద్వారా రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 6.20 లక్షల మందికి నేరుగా ఉద్యోగాలు దక్కనున్నాయి.
