Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..

Governor Abdul Nazeer

Governor Abdul Nazeer

Governor Abdul Nazeer: విశాఖపట్నంలోని జేఎన్‌టీయూ–జీవీ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి యువత కేవలం డిగ్రీలు సాధించడానికే పరిమితం కాకుండా, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల వైపు అడుగులు వేస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని గవర్నర్ పేర్కొన్నారు. విద్యార్థులను ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దడంలో అధ్యాపకులు, విద్యాసంస్థల పాత్ర అత్యంత కీలకమని ఆయన అన్నారు.

జేఎన్‌టీయూ–జీవీ క్యాంపస్‌లో ఉన్నత విద్యా ప్రమాణాలతో బోధన కొనసాగుతోందని, విద్యార్థులకు అనుకూలమైన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రశంసించారు. జల సంరక్షణ, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం ద్వారా యూనివర్సిటీని ‘నెట్ జీరో క్యాంపస్’గా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న కృషిని అభినందించారు. అలాగే, సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు సమ్మర్ ఇంటర్న్స్‌గా హాస్టల్ భవనాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను స్వయంగా చేపట్టడం ప్రశంసనీయమని అన్నారు. జాతీయ విద్యా విధానం–2020 సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.