Vijayawada Road Accident: విజయవాడ సమీపంలోని జక్కంపూడి వద్ద వెస్ట్ బైపాస్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లో కుమారుడి వివాహానికి హాజరై రాజమండ్రికి తిరుగు ప్రయాణం అవుతున్న హరిప్రసాద్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ముందుగా ఓ బైక్ను ఢీకొట్టి, అనంతరం ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవర్ హరిప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక సీటులో ప్రయాణిస్తున్న గురవయ్య తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
అయితే బైక్ను నడుపుతున్న హరికృష్ణ హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కారు బైక్ను ఢీకొన్న సమయంలో వెనుక సీటులో ఉన్న పూజా సామగ్రిలోని కొబ్బరి బొండం ఎగిరి వచ్చి కారు క్లచ్, బ్రేక్ పెడళ్ల మధ్య ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి కంటైనర్ను ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగంతో పాటు క్లచ్, బ్రేక్ మధ్య ఇరుక్కున్న కొబ్బరిబొండం కూడా కారణమై ఉండొచ్చని కొత్తపేట పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

