Vijayawada: విజయవాడ సిటీలో పేలుడు పదార్థాలు తీవ్ర కలకలం సృష్టించాయి.. నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పేలుడు పదార్థాలు లభించడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.. పోలీసులు 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో వచ్చిన ఉత్తరప్రదేశ్కు చెందిన ఆసిఫ్ అలీకి ఈ ఘటన ఎదురైంది. బస్సులో తన బ్యాగ్కు బదులుగా మరో బ్యాగ్ ఉండటాన్ని గమనించిన ఆయన దాన్ని తెరిచి చూడగా పేలుడు పదార్థాలు కనిపించినట్లు సమాచారం.
వెంటనే అప్రమత్తమైన ఆసిఫ్ అలీ బస్స్టాండ్ అవుట్పోస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బ్యాగ్ను పరిశీలించారు. అందులో ఉన్న 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణలంక ఎస్ఐ గిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సులో ప్రయాణించిన ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నారు. అలాగే బస్స్టాండ్, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ పేలుడు పదార్థాలు ఎవరి వద్ద నుంచి వచ్చాయనే విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

