Vijayawada Municipal Corporation: విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 64 డివిజన్లను 86 డివిజన్లుగా విస్తరిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను విడుదల చేశారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర.. డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నగర ప్రజలు తమ అభిప్రాయాలను అధికారులకు తెలియజేసే అవకాశం కల్పించారు. ఈ పునర్విభజనలో ముఖ్యంగా విజయవాడ తూర్పు ప్రాంతంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న 21 డివిజన్లను 29 డివిజన్లుగా పెంచుతున్నారు. సర్కిల్-3 పరిధిలో ఎనిమిది కొత్త డివిజన్లు ఏర్పాటు చేయడం ద్వారా కీలక మార్పులు చేపడుతున్నారు.
కొత్త డివిజన్ల ప్రకారం 2వ డివిజన్ నుంచి 30వ డివిజన్ వరకు సరిహద్దులను పునర్నిర్వచించారు. ఈ డివిజన్ సరిహద్దులకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. నగర విస్తరణ, జనాభా పెరుగుదల, పరిపాలనా సౌలభ్యం మరియు అభివృద్ధి పనుల సమర్థ నిర్వహణను దృష్టిలో ఉంచుకుని డివిజన్ల సంఖ్య పెంపు నిర్ణయం తీసుకున్నట్లు వీఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు విడుదల చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్పై ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్..
