Sai Krishna Custodial Death Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు విధించిన షరతులను కొనసాగిస్తూ ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో నాగరాజును విచారించడం దర్యాప్తుకు ఇబ్బందికరంగా మారుతోందని పేర్కొంటూ, విజయవాడలోని సిట్ కార్యాలయంలో కస్టడీ విచారణకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో పురోగతి కోసం విజయవాడలో విచారణ అవసరమని సిట్ తన పిటిషన్లో వివరించింది.
సిట్ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు, సీఐ నాగరాజును ఏడు రోజుల పాటు విజయవాడ సిట్ కార్యాలయంలో విచారించేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే హైకోర్టు గతంలో విధించిన ఇతర అన్ని షరతులు యథావిధిగా అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రేపటి నుంచి సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విజయవాడలో సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ విచారణతో కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

