Sai Krishna Custodial Death Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1)గా ఉన్న సీఐ నాగరాజు, తనపై నమోదైన హత్య కేసును కొట్టివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజు, తన అరెస్టు చట్టవిరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు.
పిటిషన్లో నాగరాజు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తనపై ఎలాంటి ప్రత్యక్ష ఆధారాలు లేకుండానే కేవలం సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారని వాదించారు. కేసులో ఇప్పటివరకు మృతదేహాన్ని కూడా గుర్తించలేదని, అసలు ఏమి జరిగిందనే విషయంపై స్పష్టత లేకుండానే తనను అరెస్టు చేశారని తెలిపారు. అలాగే హత్య జరిగినట్లు నిరూపించే ఫోరెన్సిక్ ఆధారాలు కూడా లేవని, ఈ పరిస్థితుల్లో తన రిమాండ్ చట్టబద్ధం కాదని పిటిషన్లో పేర్కొన్నారు. సాయికృష్ణ తల్లి కూడా ప్రత్యక్ష సాక్షి కాదని, కేవలం అనుమానాలు మాత్రమే వ్యక్తం చేశారని నాగరాజు వాదించారు.
అరెస్టుకు ముందు తనకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, దర్యాప్తు అధికారి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కూడా సాయికృష్ణ మృతదేహం ఇంకా గుర్తించలేదని, ఏమి జరిగిందో స్పష్టత లేదని పేర్కొన్న విషయాన్ని నాగరాజు తన పిటిషన్లో ప్రస్తావించారు. ఈ క్వాష్ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసుపై రేపు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, విచారణలో వెలువడే పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

