JP Nadda: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. ఏపీ ఆరోగ్య రంగానికి కేటాయింపులపై కీలక ప్రకటన చేశారు.. విజయవాడలోని ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ బ్లాక్, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ప్రారంభించిన జేపీ నడ్డా.. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ దేశవ్యాప్తంగా ఆరోగ్య సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కోవిడ్ సమయంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.64,100 కోట్లు ఖర్చు చేస్తున్నామని జేపీ నడ్డా వెల్లడించారు. రాష్ట్రానికి 24 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 26 ల్యాబొరేటరీలు మంజూరు చేశామని తెలిపారు. ఇప్పటికే 500 క్రిటికల్ కేర్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో ఆయుష్మాన్ ఆరోగ్య సేవా మందిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్పై దృష్టి
2017లో కొత్త హెల్త్ పాలసీని తీసుకొచ్చామని నడ్డా తెలిపారు. కేవలం వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించే క్యూరేటివ్ హెల్త్ కేర్ విధానం నుంచి కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ వైపు భారత్ ముందుకు సాగుతోందన్నారు. గతంలో సూపర్ స్పెషాలిటీ వైద్యంపై ఎక్కువగా ఆధారపడేవాళ్లమని, ఇప్పుడు నివారణ, ముందస్తు గుర్తింపు, సమగ్ర ఆరోగ్య సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. వంటగది కూడా ఒక ఫార్మసీలా పనిచేస్తుందని, ఆహారమే ఔషధంగా ఉండేలా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, దేశవ్యాప్తంగా 1.86 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు 140 కోట్ల మంది ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలకు తొలి ఆధారంగా నిలుస్తున్నాయని నడ్డా తెలిపారు. ఏపీలో ఇంద్రధనుష్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా అమలు చేశారని ప్రశంసించారు. హైపర్టెన్షన్ కోసం 42 కోట్ల మందికి స్క్రీనింగ్, 36 కోట్ల మందికి నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు.
టీబీ నియంత్రణలో భారత్ పురోగతి
భారతదేశంలో ట్యూబర్క్యులోసిస్ (TB) కేసులు 21 శాతం తగ్గాయని నడ్డా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టిబీ తగ్గుదల 11 శాతంగా ఉంటే, భారత్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించామని చెప్పారు. ఆరోగ్య సేవలను ప్రతి కుటుంబానికి చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇక, గత 12 సంవత్సరాల్లో దేశంలో 16 ఎయిమ్స్లను ఏర్పాటు చేశామని కేంద్రమంత్రి తెలిపారు. 960 పడకల సామర్థ్యంతో ఉన్న మంగళగిరి ఎయిమ్స్ దేశంలో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీ అభివృద్ధికి రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నామని, అనంతపురంలోనూ రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రతి ఇంటికీ ఆరోగ్య సేవలు చేరాలనే ఆలోచన అద్భుతమని నడ్డా అన్నారు. సంజీవని ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుందో పరిశీలించాల్సి ఉందని చెప్పారు. త్వరలో ముగ్గురు నిపుణులను బయోసిటీని అధ్యయనం చేసేందుకు పంపిస్తానని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులతో పాటు సమగ్ర వైద్య సేవలను మరింత విస్తరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

