Egg Prices Fall: ఒకప్పుడు కొండెక్కి కూర్చుకున్న కోడి గుడ్డు ధర ఇప్పుడు భారీగా పతనం అవుతోంది.. కోడి గుడ్డు ధరలు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ప్రస్తుతం మార్కెట్లో కోడి గుడ్డు ధర ఇప్పటికే రూ.4.50 వరకు పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే గుడ్డు ధర రూ.3 వరకు పడిపోవచ్చని పౌల్ట్రీ రంగానికి చెందిన వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Special Officers Rule in AP: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన..
గల్ఫ్ దేశాలకు గుడ్ల సరఫరా నిలిచిపోవడం వల్ల మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు క్షీణిస్తున్నాయని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే పౌల్ట్రీ రైతులు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల వివరాల ప్రకారం, ఒక్క గుడ్డు తయారీకి సుమారు రూ.4 వరకు ఖర్చు అవుతుంది. అయితే ప్రస్తుతం ధరలు ఆ స్థాయికి కూడా రాకపోవడం వల్ల రైతులు నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది. పౌల్ట్రీ ఫారమ్ల నుంచి వినియోగదారుడి వరకు గుడ్లు చేరేందుకు సాధారణంగా సుమారు 12 రోజుల సమయం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ గడువు దాటితే గుడ్లు పాడైపోయే ప్రమాదం ఉండటంతో వాటిని రోడ్లపై పారబోయాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ దేశాలకు గుడ్ల ఎగుమతి అవకాశాలు కల్పించడం, అలాగే దేశంలో గుడ్ల వినియోగాన్ని పెంచే చర్యలు చేపట్టాలని పౌల్ట్రీ రంగానికి చెందిన వ్యాపారులు కోరుతున్నారు.
