Deputy CM Pawan Kalyan Deeksha: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టారు.. ఇక, అందులో భాగంగా ఈ రోజు ఇంద్రకీలాద్రిని దర్శించుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు.. మరోవైపు వచ్చే నెల 1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళ్లనున్నారు పవన్.. 2వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు.. 3వ తేదీన తిరుపతిలో వారాహి సభ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. ఇక, తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన విషయం విదితమే.. భక్తులు.. తిరుమల వేంకటేశ్వర స్వామిపై విశ్వాసంతో ఆస్తులిచ్చారని.. వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించిన విషయం విదితమే..
Read Also: Ponguleti Srinivas Reddy : కేటీఆర్ కి పొంగులేటి సవాల్.. బావా బామ్మర్దుల మధ్య విభేదాలు అందరికి తెలుసు
గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను.. భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు పవన్ కల్యాణ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసంతో తమకు ప్రాప్తించిన ఆస్తిపాస్తులు దైవానుగ్రహమని భక్తులు భావిస్తారన్నారు. తమ ఆస్తులను ఆ భగవంతుడికే ఇచ్చేస్తూ… దస్తావేజులను హుండీలో వేసే భక్తులూ ఉన్నారని పవన్ వెల్లడించారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు.. ఇలా పలు రాష్ట్రాల్లో స్థిరాస్తులు ఉన్నాయన్నారు. ముంబై, హైదరాబాద్ నగరాల్లో భవనాలు ఉన్నాయన్నారు. భక్తులు ఏ ఎంతో విశ్వాసంతో ఇచ్చిన ఆస్తులను నిర్దకం అంటూ విక్రయించాలని వైసీపీ పాలనలో నియమితమైన టీటీడీ పాలక మండలి నిర్ణయించి ప్రకటన కూడా ఇచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఇక, ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వచ్చిన ఆదాయాన్ని నాటి పాలక మండళ్ళు ఎటు మళ్లించాయో కూడా విచారణ చేయాలని సీఎంను కోరామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అటు కశ్మీర్ నుంచి ఇటు బెంగాల్ వరకూ ఆలయాలు నిర్మించేస్తామని అప్పటి పాలకులు చెప్పారన్నారు. అసలు ఆ ఆలయాలు ఎవరి ద్వారా నిర్మాణం చేపట్టారు? సంస్థ ఏమిటని ప్రశ్నించారు. ఎంత మేరకు శ్రీవాణి ఆదాయం మళ్లించారో భక్తులకు తెలియచేయడం అవసరమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రమే కాదు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలోనూ ఒక సమీక్ష అవసరమని సీఎంకి సూచిస్తున్నానని.. ప్రభుత్వ ఆస్తులను తనఖాలు పెట్టేసిన గత పాలకులు దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే..