
ఆంధ్రప్రదేశ్ లో కరోనా టీకా పంపిణి వేగవంతంగా జరుగుతున్నది. కరోనా టీకా కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట అధికంగా ఉండటంతో ఈరోజు రేపు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం. టీకా కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఓటర్ స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులను ఓటర్లకు అందించేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం. ఎవరికి ఏ టైమ్ కి వ్యాక్సిన్ అందించాలి అనే సమాచారంతో కూడిన స్లిప్పులను ప్రజలకు అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. వ్యాక్సిన్ స్లిప్పులను ఏఎన్ఎం, ఆశావర్కర్ల ద్వారా స్లిప్పులను పంపిణీ చేస్తారు. అదే విధంగా అర్బన్ ప్రాంతాల్లో ఎస్ఎంఎస్ ల ద్వారా వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించనున్నది ప్రభుత్వం. ఇక మొదటి డోసు వేయించుకున్న వేలాది మంది రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. రెండో డోసు వ్యాక్సిన్ పూర్తయ్యాకే మొదటి డోస్ ఇవ్వాలని, మొదటి డోస్ ఎక్కడ వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.