Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇవాళ సాయంత్రం కీలకఘట్టమైన ధ్వజారోహణం కార్యక్రమం జరగనుంది. దీంతో, తిరుమల గిరుల్లో బ్రహ్మోత్సవ శోభ కనిపిస్తోంది. నిన్న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి తరపున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పుట్ట మన్నులో నవధాన్యాలను నాటారు వేద పండితులు, ఆలయ అర్చకులు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
ఇక, ఈ రోజు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు వెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సీఎం హోదాలో చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనుండటం ఇది 15వ సారి. ధ్వజారోహణం కార్యక్రమంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవాళ రాత్రికి పెద్దశేష వాహన సేవతో మలయప్ప స్వామి వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఈ నెల 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 23 వరకు బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి టికెట్ల విధానాన్ని రద్దుచేశారు. సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా, రోజుకు 80 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉత్సవ సమయంలో రోజుకు అదనంగా మరో లక్ష మంది భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి వాహన సేవలను భక్తులు వీక్షించేందుకు మాడవీధుల్లో 190 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సుమారు లక్షా 80 వేల మంది భక్తులు స్వామివారి వాహన సేవలను తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ఉత్తర మాడవీధిలో 59 వేల మంది, తూర్పు మాడవీధిలో 43 వేల మంది, పడమర మాడవీధిలో 41 వేల మంది, దక్షిణ మాడవీధిలో 20 వేల మంది భక్తులు వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

