NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: తిరుమల డిక్లరేషన్‌పై సంతకం చేసిన పవన్‌ కల్యాణ్‌.. ఎందుకంటే..?

Pawan Daughter Declaration

Pawan Daughter Declaration

Deputy CM Pawan Kalyan: తిరుపతి నుంచి నడకమార్గంలో తిరుమల చేరుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు శ్రీవారిని దర్శించుకోనున్నారు.. శ్రీవారిని దర్శించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.. అయితే, ఈ పర్యటనలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. పవన్ కల్యాణ్‌ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల.. తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఇక, పలీనా అంజని మైనర్ కావడంతో.. ఆమె తండ్రిగా పవన్ కల్యాణ్‌ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫొటోల్లో పవన్‌ కల్యాణ్‌ పెద్ద కుమార్తె ఆద్యా కూడా ఉంది.. ఇద్దరు కామార్తెలతో కలిసి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు దిగారు..

Read Also: Pune Helicopter Crash: హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్‌లతో సహా ముగ్గురు మృతి..

ఇక, మరికాసేపట్లో శ్రీవారిని దర్శించుకోనున్న పవన్ కల్యాణ్‌.. స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు.. నిన్న రాత్రి నుంచి తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నారు పవన్.. వెన్ను నొప్పి నేపథ్యంలో దర్శనం అనంతరం పవన్ కల్యాణ్‌ నేరుగా అతిధి గృహానికి వెళ్లే అవకాశం ఉందంటున్నారు.. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం.. శ్రీవారి దర్శనాంతరం నేరుగా తరిగొండ అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్.. అక్కడ అన్నప్రసాద సముదాయంలో అన్నప్రసాదాల తయారిని పరిశీలించనున్నారు.. అన్నప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాని స్వీకరించనున్నారు.. ఇక, లడ్డూ ప్రసాదం తయారు చేసే బూందీ పోటుని కూడా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పరిశీలించే అవకాశం ఉందన్నారు.. ఇక, ఆరోగ్య సమస్యలతో.. దీక్ష విరమణ తర్వాత తిరిగి అతిథి గృహానికి చేరుకుంటారా? లేదా యథావిథిగా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారో చూడాలి. కాగా, తిరుమలలో లడ్డూ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత.. డిక్లరేషన్‌పై పెద్ద ఎత్తున చర్చ సాగిన విషయం విదితమే.