Telugu Desam Party: మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల కారుపై దాడి, అద్దాలు ధ్వంసం

Dhulipalla Narendra

Dhulipalla Narendra

గుంటూరు జిల్లా అనుమర్లపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ పొన్నూరు నియోజకవర్గ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనుమర్లపూడి చెరువులో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ధూళిపాళ్ల నరేంద్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో వారు ఘర్షణకు దిగారు. ధూళిపాళ్లకు వ్యతిరేకంగా గోబ్యాక్ న‌రేంద్ర, డౌన్ డౌన్ నరేంద్ర అంటూ నినాదాలు చేశారు.

అయితే వైసీపీ కార్యకర్తలు తనను అడ్డుకోవడంతో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలను ప్రశ్నిస్తే మీకేందుకు భయం అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. అనుమర్లపూడి అనే కాకుండా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో క్వారీ, వ‌డ్లమూడి, సంగంజాగ‌ర్లమూడి, చేబ్రోలు త‌దిత‌ర ప్రాంతాల్లోనూ వైసీపీ నేతలు అక్రమంగా మ‌ట్టి త‌వ్వకాలు జ‌రుపుతున్నార‌ని, దీనివ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణ స‌మతుల్యత దెబ్బతింటోంద‌ని ధూళిపాళ్ల న‌రేంద్ర ఆరోపించారు. తన నియోజ‌క‌వ‌ర్గంలో పోలీసుల రాజ్యం న‌డుస్తోంద‌ని, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ మండిప‌డ్డారు.