కర్నూలు జిల్లా పరిధిలోని అత్యంత కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టులోని 9వ గేటు ఒక్కసారిగా తెగిపోయి కిందపడటంతో అక్కడున్న సిబ్బంది, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అధికారులు నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు , పనులు నిర్వహించేందుకు గేటును పైకి ఎత్తుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఊహించని విధంగా గేటు రోప్స్ తెగిపోవడంతో అది అలాగే కిందపడి నిలిచిపోయింది.
ఆపరేషన్ లో లేని గేట్లు… అధికారుల నిర్లక్ష్యం?
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు సంబంధించి 1, 2, 9, 10 నంబరు గేట్లను చాలా రోజులుగా సరిగ్గా ఆపరేట్ చేయడం లేదని తెలుస్తోంది. క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేపట్టకపోవడం, చాలా కాలం పాటు ఆపరేషన్లో లేకపోవడం వల్లనే లోహపు రోప్లు బలహీనపడి 9వ గేటు తెగిపడి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్వహణ తీరుపై , అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాలువలకు కొనసాగుతున్న నీటి విడుదల
ప్రమాదం జరిగినప్పటికీ, ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం జలాల తరలింపు కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి సుమారు 8 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువకు ప్రవహిస్తోంది. ఈ హెడ్ రెగ్యులేటర్ ఆధారంగా కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ (SRBC) , తెలుగు గంగ కాలువలకు నీటి విడుదల నిరంతరాయంగా సాగుతోంది.
అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు
గేటు తెగిపడిన విషయం తెలిసిన వెంటనే నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, ప్రాజెక్టు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నీటి ఉధృతి వల్ల ఎలాంటి అదనపు ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. తెగిపోయిన 9వ గేటును పునరుద్ధరించేందుకు , ఇతర గేట్ల భద్రతను పరిశీలించేందుకు నిపుణుల బృందం రంగంలోకి దిగింది.

