జనసేన ఎంపీల మీద పార్టీ అధ్యక్షుడు పవన్ బాగా సీరియస్గా ఉన్నారా? ఇద్దరికీ ఓ రేంజ్లో క్లాస్ పీకారన్నది నిజమేనా? స్వయంగా అధినేతే ఆగ్రహం వ్యక్తం చేసినా వాళ్ళలో మార్పు రావడం లేదా? ఇంతకీ ఏ విషయంలో పవన్కళ్యాణ్ తన పార్టీ లోక్సభ సభ్యులను కోప్పడ్డారు? ఆయన ఏం ఆశిస్తున్నారు? వాళ్ళు ఎక్కడ ఫెయిలవుతున్నారు? జనసేన లోక్సభ సభ్యులు ఇద్దరి మీద పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాగా సీరియస్గా ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఢిల్లీలో పార్టీ గొంతుకగా నిలుస్తారని ఆశిస్తే…. కనీస ప్రయత్నం కూడా జరగడం లేదని అసహనంగా ఉన్నారట పవన్. ఇద్దరూ…. పార్టీ పనులకన్నా సొంత వ్యవహారాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్న క్రమంలో….. ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఎంపీలు ఊహించని స్థాయిలో పార్టీ అధ్యక్షుడు క్లాస్ పీకినట్టు తెలిసింది. మీటింగ్లో పవన్ ఆగ్రహం చూశాక మిగతా నాయకులంతా మైకుల ముందుకు పరుగులుపెట్టి స్టేట్మెంట్స్ ఇస్తున్నా… ఎంపీలు ఇద్దరిలో మార్పు కనిపించడం లేదని మాట్లాడుకుంటున్నాయి జనసేన వర్గాలు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వ్యవహారం గురించి ఇప్పుడు గ్లాస్ పార్టీలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. కొత్త యువకుడు, ఉత్సాహంగా పనిచేస్తారని ఆశించి ఉదయ్ శ్రీనివాస్కు కాకినాడ లాంటి కీలక స్థానం అప్పగించారు పవన్.
అలాగే… అప్పటి వరకు వైసీపీలో ఉండి ఎన్నికలకు ముందు వచ్చిన బాలశౌరి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం టికెట్ ఇచ్చి గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే…. ప్రస్తుతం వీళ్ళిద్దరూ అధ్యక్షుడు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్నది జనసైనికుల మాట. బాలశౌరి వ్యాపార వ్యవహారాల మీదే ఎక్కువగా దృష్టి పెడుతూ…. అసలు నియోజకవర్గంలోగాని, రాష్ట్రంలోగాని ఎక్కడా పెద్దగా కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇక తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అస్సలు యాక్టివ్గా ఉండడం లేదని చెప్పుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పవన్ ఇద్దరి మీద ఆ స్థాయిలో సీరియస్ అయినట్టు తెలిసింది. వ్యాపారాలు, లాబీయింగ్స్లో ఒకరు బిజీగా ఉంటే…. మరొకరు జల్సాలకు అలవాటు పడి విదేశాల్లోనే ఎక్కువగా గడిపేస్తున్నారంటూ గట్టిగా అన్నట్టు సమాచారం. ఆ మధ్య పిఠాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు స్వయానా పార్టీ అధినేత వచ్చినా…. సొంత పార్లమెంట్ నియోజకవర్గం అయివుండి కూడా ఉదయ్శ్రీనివాస్ హాజరవకుండా… ఫారిన్ ట్రిప్ వేయడాన్ని ఉద్దేశ్యపూరిత నిర్లక్ష్యంగానే భావిస్తోందట పార్టీ నాయకత్వం. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే సర్వసభ్య సమావేశంలో ఇద్దర్నీ కడిగేసినట్టు చెప్పుకుంటున్నారు జనసేననాయకులు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగడంతోపాటు ఢిల్లీలో కూడా ప్రభావం చూపాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు పవన్.
ఉన్నది ఇద్దరు ఎంపీలే అయినా…. వాళ్ల ద్వారానే పార్టీ విధానాలు, రాష్ట్ర సమస్యలపై ఢిల్లీ స్థాయిలో వాయిస్ వినిపించాలని అనుకున్నారట. అందుకే… తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా భావించిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు కాకినాడ నుంచి, ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలున్న బాలశౌరికి మచిలీపట్నం నుంచి అవకాశం కల్పించారు. కానీ…. ఇద్దరూ అధినేత ఆశించిన స్థాయిలో పని చేయడం లేదంటూ… కొద్ది నెలలుగా పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు మెరుగుపరుచుకోవాలని పదేపదే చెప్పినా… వైఖరిలో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది పార్టీలో. దాన్ని దృష్టిలో ఉంచుకునే జనరల్ బాడీ మీటింగ్లో సీరియస్ అయినట్టు తెలిసింది. ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని, పార్లమెంట్లో పూర్ పెర్ఫార్మెన్స్ అంటూ నెగెటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయంటూ సమావేశంలో ఇద్దరికీ క్లియర్గా చెప్పారట పార్టీ అధ్యక్షుడు. రాష్ట్రంలో కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ…. వైసీపీ ఎంపీలు ఢిల్లీ స్థాయిలో గట్టిగా ప్రస్తావిస్తూ హైలైట్ చేస్తున్నా… మన వాళ్ళు నోరు తెరవకపోవడం ప్రత్యర్థులకు అడ్వాంటేజ్ అవుతోందని జనసేన సర్కిల్స్లో మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా వాదనలు వినిపిస్తుంటే సొంత పార్టీ సభ్యుల మౌనం పవన్కు ఆగ్రహం తెప్పిస్తున్నట్లు సమాచారం. దీంతో పవన్ క్లాస్ తర్వాత అయినా మార్పు వస్తుందా లేక అలాగే కొనసాగుతుందా అన్న చర్చలు నడుస్తున్నాయి కేడర్లో.
