ఏపీ ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడుతోందని విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఎంత అప్పు చేసిందో తెలుసా? కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ అప్పులపై కీలక ప్రకటన చేశారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ తీసుకున్న రుణం మెత్తం 3 లక్షల 7 వేల 671 కోట్ల రూపాయలు అని ఆర్థికమంత్రి తెలిపారు.
2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రుణం మెత్తం 3 లక్షల 60 వేల 333 కోట్ల రూపాయలు. 2021-22 లో అదనంగా తీసుకున్న రుణం సుమారు 53 వేల కోట్ల రూపాయలు అని ఆమె వెల్లడించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ రుణం మొత్తం 3 లక్షల 98 వేల 903 కోట్ల రూపాయలుగా ఆమె వివరించారు. 2022-23 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం వివిధ అవసరాల కోసం అదనంగా తీసుకున్న రుణం 38 వేల కోట్ల రూపాయలుగా ఆమె తెలియచేశారు.
CM Jagan Review: ఆదాయం తెచ్చే శాఖలపై జగన్ సమీక్ష
ఏపీలో అప్పులపై ఆర్థిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో చంద్రబాబు హయాం నుంచి ఇప్పటివరకూ అప్పులు పెరుగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.3.80 లక్షల కోట్లుగా ఇటీవల వెల్లడించారు. అయితే, తమ ప్రభుత్వం కేంద్ర నిబంధనలకు లోబడే అప్పులు చేసిందని ఆయన స్పష్టం చేశారు.. ఏపీలో అప్పులు పెరిగినమాట నిజమే.
కానీ, కోవిడ్, ఇతర పరిస్థితుల వల్లే అప్పు పెరిగిందన్నారు. రాష్ట్ర విభజన నాటికి 1.34 లక్షల కోట్లుగా అప్పు ఉంటే ఏపీలో ద్రవ్యలోటు చాలా తక్కువని దువ్వూరి కృష్ణ వివరించారు. చంద్రబాబు హయాంలో ఏటా 19.4 శాతం అప్పులు ఉంటే.. ఇప్పుడు 15.77 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని వెల్లడించారు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.39 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు దువ్వూరి కృష్ణ. టీడీపీ ప్రభుత్వం గతంలో నిబంధనలకు లోబడకుండా అప్పులు చేసిందంటున్నారు వైసీపీ నేతలు.
