అమరావతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిష్టాత్మక ‘మహానాడు’ ఉత్సవాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ సంస్కరణలు, మహిళా సాధికారత, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది ప్రతినిధులు, కార్యకర్తలు ఈ మహానాడుకు హాజరయ్యారని, ఈసారి డిజిటల్ టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించుకున్నామని ఆయన వెల్లడించారు.
మహానాడు వేదికగా మహిళా లోకానికి లోకేష్ ఒక చారిత్రాత్మక భరోసా ఇచ్చారు. “పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలోనే చెప్పాం.. దానికి అనుగుణంగా 2029 ఎన్నికల నాటికి దీనిని పూర్తిగా అమలు చేస్తాం” అని స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీలో సమర్థులైన మహిళా నాయకత్వాన్ని ఇప్పటికే గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఒక సామాన్య స్కూల్ టీచర్గా ఉన్న వంగలపూడి అనిత ఈరోజు రాష్ట్రానికి హోంమంత్రి అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశమేనని గుర్తుచేశారు. అనితతో పాటు శిరీష, గల్లా మాధవి వంటి ఎందరో కొత్తవారికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించామన్నారు. ‘కార్యకర్తే అధినేత.. నా తెలుగుదేశం నా బాధ్యత’ అనే నినాదంతోనే ఇకపై అన్ని సమావేశాలు ప్రారంభం కావాలని, కార్యకర్తల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భరోసా ఇచ్చారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పూర్తి సిద్ధంగా ఉందని నారా లోకేష్ ప్రకటించారు. గత వైసీపీ పాలనలో నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కుని, అక్రమంగా, అరాచకంగా ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ “ఏకగ్రీవాలు జరిగితే ఒప్పుకోను” అనడం చూస్తుంటే.. వారి హయాంలో జరిగినవన్నీ అక్రమ ఏకగ్రీవాలేనని స్వయంగా ఒప్పుకున్నట్లయిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాల వల్లే ప్రజలు వారిని 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు. తాము అలాంటి తప్పులు చేయబోమని, ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతుతోనే పంచాయతీలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
యువతకు, ‘జెన్ జీ’ (Gen Z) తరానికి అవసరమైన సంస్కరణలు, నిర్ణయాలు పార్టీలో నిరంతర ప్రక్రియగా సాగుతుంటాయని లోకేష్ పేర్కొన్నారు. గత మహానాడులో ఆరు సూత్రాలను తీసుకొచ్చామని, ఈసారి మహిళలు, యువత ప్రయోజనాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఇతర పార్టీలు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తాయా లేదా అనేది తమకు అనవసరమని, టీడీపీ పరంగా కింది స్థాయి నుండి కొత్త లీడర్షిప్ను బిల్డప్ చేస్తున్నామన్నారు.
నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం.. కోర్టు కేసులు, ఎన్నో అడ్డంకులు సృష్టించినా వాటన్నింటినీ అధిగమించి కేవలం 150 రోజుల్లోనే పారదర్శకంగా డీఎస్సీ (DSC) ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టామని లోకేష్ వివరించారు. అలాగే అర్హులైన వారికి అందించే కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా జరుగుతోందని, రాబోయే జూన్ నెలలోనే కొత్త పెన్షన్లను లబ్ధిదారులకు అందజేస్తామని నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
