Sangameswara Temple: ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేవు.. ఎగువ ప్రాంతాల నుంచి వరదలు లేవూ.. దీంతో.. గత ఏడాదికి భిన్నంగా కృష్ణానదిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది.. శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వలు రోజురోజుకూ వేగంగా తగ్గుతుండటంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమం వద్ద ఉన్న సంగమేశ్వర ఆలయ శిఖరం భక్తులకు దర్శనమిస్తోంది. నీటిమట్టం మరింత తగ్గితే ఆలయం పూర్తిగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 118.62 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాల కోసం గత నెల రోజులుగా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రిజర్వాయర్లో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. అయితే, శ్రీశైలం నుంచి నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో కేవలం ఐదు వారాల వ్యవధిలోనే సంగమేశ్వర ఆలయ శిఖరం బయటకు వచ్చింది. గత నెల ఆగస్టు 6న శ్రీశైలం నీటితో పూర్తిగా జలాధివాసమైన సంగమేశ్వరాలయం, ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో క్రమంగా దర్శనమిస్తోంది.
సంగమేశ్వర ఆలయం సప్తనదుల సంగమం వద్ద ఉండటంతో శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం తగ్గినప్పుడు ఆలయ నిర్మాణం బయటకు వస్తుంది. దీంతో భక్తులు ఆలయ శిఖరాన్ని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గుతున్న వేగాన్ని బట్టి చూస్తే మరో 15 నుంచి 20 రోజుల్లో సంగమేశ్వర ఆలయం పూర్తిగా బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తుల్లో ఆసక్తి పెరుగుతోంది. కాగా, శ్రీశైలం రిజర్వాయర్లో క్రమంగా నీటి మట్టం పెరిగితే.. సంగమేశ్వరుడి ఆలయం గంగమ్మ ఒడిలోకి చేరుతుంది.. క్రమంగా ఆలయాన్ని మొత్తం ముంచెత్తుతుంది.. అయితే, గతానికి భిన్నంగా ఈ ఏడాదికి త్వరగా సంగమేశ్వరుడి గుడి క్రమంగా బయటకు వస్తుంది..
కాగా, శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలిచిపోయింది.. ఇన్ఫ్లో నిల్ కాగా.. ఔట్ ఫ్లో 17,270 క్యూసెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 863.60 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటినిల్వ 117.4872 టీఎంసీలుగా ఉంది.. ఇక, కుడి గట్టుతో పాటు.. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది..

