రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు

విజయవాడ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌తో సమావేశం ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు ప్రకటించారు. తనకు రాజ్యసభ టిక్కెట్ వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని… తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోనని చిరంజీవి స్పష్టం చేశారు.

Read Also: వైఎస్ఆర్ విగ్రహం మాయం.. ఆందోళనకు దిగిన వైసీపీ ఎమ్మెల్యే

కాగా గురువారం నాడు సీఎం జగన్‌ను చిరంజీవి కలిసిన నేపథ్యంలో కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి. మరో నాలుగు నెలల్లో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దీంతో చిరంజీవికి వైసీపీ నుంచి సీఎం జగన్ రాజ్యసభ టిక్కెట్ ఆఫర్ చేశారని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తనకు కాస్త సమయం కావాలని చిరంజీవి అన్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. దీంతో చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం, థియేటర్ల మనుగడ కోసం సీఎం జగన్‌ను కలిసి చర్చించిన విషయాలను పక్కదోవ పట్టించే విధంగా కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయని చిరు ట్వీట్ చేశారు. జగన్‌తో మీటింగ్‌కు రాజకీయ రంగు పులిమి తనను రాజ్యసభకు పంపుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు.