NTV Telugu Site icon

త‌గ్గేదేలే.. ఎస్మాకు భ‌య‌ప‌డేదేలే.. స‌మ్మెలోకి వైద్యారోగ్య శాఖ సిబ్బంది

స‌మ్మెపై వెన‌క్కి త‌గ్గేదేలే అని తేల్చాశాయి ఉద్యోగ సంఘాలు.. ఇవాళ స‌మావేశ‌మైన‌ వైద్యారోగ్య శాఖ సంఘాల జేఏసీ.. స‌మ్మెపై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది.. ఫిబ్ర‌వ‌రి 7వ‌ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మావేశం త‌ర్వాత మీడియాకు వెళ్ల‌డించారు నేత‌లు.. వైద్యారోగ్య శాఖ గత రెండున్నరేళ్ల కాలంగా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పని చేస్తోన్నా.. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.. కరోనా కాలంలో సెలవులు కూడా ఇవ్వకుండా దుర్మార్గమైన రాక్షస అధికారుల పాలన సాగుతోంద‌ని ఆరోపించారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి ఆస్కార్ రావు.. వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ బాధ్యతలను జేసీలకి అప్పజెప్పొద్దని స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేద‌న్న ఆయ‌న‌.. పీఆర్సీ సాధన విషయంలో సమితి నేతలతో కలిసి వెళ్లాలని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు కూడా ఏడో తేదీన సమ్మెకు వెళ్తార‌ని.. పీఆర్సీ సమస్యతో పాటు.. వైద్యారోగ్య శాఖ సమస్యలు పరిష్కరించాల్సిందే అన్నారు.

Read Also: పెట్రో ధ‌ర‌లు త‌గ్గించాల్సిందే.. భార‌తీయుల డిమాండ్…!

వైద్యారోగ్య శాఖ సమస్యలు పరిష్కారం కాకుంటే మా ఉద్యమం కొన‌సాగిస్తామ‌ని ప్ర‌క‌టించారు ఆస్కార్ రావు.. టెక్నికలుగా ఏ మాత్రం విషయం లేని జేసీలు.. మేం వైద్యం ఎలా చేయాలో చెబుతున్నార‌ని ఫైర్ అయ్యారు.. మా ఆత్మ గౌరవం దెబ్బతింటోంది.. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాల‌ని డిమాండ్ చేశారు.. ఇక‌, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులుగా మేం చాలా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని తెలిపారు వైద్యారోగ్య శాఖ జేఏసీ ప్రతినిధి అరవపాల్.. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మెడికల్ అధికారులంతా సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నార‌ని.. ఈ ప్రభుత్వ తీరును క్షేత్ర స్థాయిలో ఏ ఒక్కరూ హర్షించడం లేద‌న్నారు.. ఛలో విజయవాడను సక్సెస్ చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం అన్నారు.

మ‌రోవైపు, వైద్యారోగ్య శాఖలో బదిలీలు సరికాద‌న్నారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి శివారెడ్డి… ఉద్య‌మాన్ని నీరుగార్చేందుకే ఇప్పుడు వైద్యారోగ్య‌శాఖ‌లో బ‌దిలీలు తీసుకొచ్చార‌ని ఆరోపించిన ఆయ‌న‌.. ఏప్రిల్, మే నెలల్లో బదిలీల ప్రక్రియను చేపట్టాలి.. కరోనా సమయంలో బదిలీలు స‌రికాద‌న్నారు.. ఇక‌, బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.. వైద్యారోగ్య శాఖ సమ్మెకు వెళ్తే ప్రజల ప్రాణాలకు ఇబ్బందే అని.. ప్రజల ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.. మ‌రోవైపు, ఎస్మాలకు భ‌య‌ప‌డేది లేద‌ని స్ప‌ష్టం చేశారు శివారెడ్డి.