Kurnool Ganesh Immersion: వర్షాలు లేకపోవడం, కృష్ణానదిలోనూ తగినంత నీటి లభ్యత లేకపోవడం ఇప్పుడు వినాయక నిమజ్జనంపై ప్రభావం పడుతోంది.. అయితే, వినాయక నిమజ్జనానికి కర్నూలులో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సుంకేసులలో నీటి లభ్యత లేకపోవడంతో అక్కడి నుంచి కే.సి. కెనాల్కు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. దీంతో ప్రస్తుతం కే.సి. కెనాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం సాధ్యం కాదని స్పష్టం చేశారు. హంద్రీనీవా కాలువలోని నన్నూర్ టోల్గేట్, తడకనపల్లె, ఉలిందకొండ ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. హంద్రీనీవాకు మరో 12 నుంచి 14 రోజుల పాటు నీటిని తీసుకునే అవకాశం ఉందన్నారు. పెద్ద విగ్రహాల నిమజ్జనానికి కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
5, 7వ రోజుల్లో నిమజ్జనానికి అనుకూలం
వినాయక నిమజ్జనానికి 5వ, 7వ, 9వ రోజుల్లో హంద్రీనీవాలో అవకాశం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే 5వ, 7వ రోజుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆ రెండు రోజులు నిమజ్జనానికి అత్యంత అనుకూలంగా ఉంటాయని చెప్పారు. 9వ రోజు నీటి లభ్యత ఎలా ఉంటుందో ఇప్పుడే ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదన్నారు భరత్.. నిమజ్జన కమిటీ మూడు ప్రాంతాల్లో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎంపిక చేసిన ప్రాంతంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పెద్ద విగ్రహాలను కమిటీ, అధికారులు ఎంపిక చేసిన ప్రాంతంలోనే నిమజ్జనం చేయాలని సూచించారు.
మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలి
ప్రజలు ఒక అడుగు నుంచి అడుగున్నర వరకు ఉండే మట్టి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేశారు. చిన్న మట్టి విగ్రహాలను ఇంటి వద్దే నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
వర్షాల కోసం వరుణ యాగం
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవాలని వరుణ యాగం నిర్వహించే అంశంపై కేబినెట్లో చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు. కర్నూలులో గాయత్రి గోసేవ సమితి ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు చెప్పారు. వర్షాలు కురిసి సుంకేసులకు నీరు చేరితే.. అక్కడి నుంచి కే.సి. కెనాల్కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కే.సి. కెనాల్లో వినాయక నిమజ్జనం సాధ్యం కాదని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. నీటి కొరత, వర్షాభావ పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకుని ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో నిమజ్జనానికి సహకరించాలని కోరారు మంత్రి టీజీ భరత్..

