MLC Anantha Babu Wife: కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మి దుర్గ పై సిట్ అధికారులు విస్తృతంగా విచారణ నిర్వహించారు. తొలి రోజు జరిగిన ఈ విచారణ దాదాపు ఆరు గంటల పాటు కొనసాగింది. సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ Manish Devaraj Patil ఆధ్వర్యంలో లక్ష్మి దుర్గను అధికారులు ప్రశ్నించారు. తమ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలపై ఆమెను వివరణ కోరారు.
న్యాయవాది సమక్షంలో విచారణ
లక్ష్మి దుర్గను ఆమె న్యాయవాది సమక్షంలోనే సిట్ అధికారులు విచారించారు. విచారణ సందర్భంగా ఆమె ఇచ్చిన సమాధానాలను పోలీసులు వీడియో రూపంలో రికార్డు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళా సబ్ఇన్స్పెక్టర్లు లక్ష్మి దుర్గ స్టేట్మెంట్ను నమోదు చేశారు. ఈ కేసులో విచారణను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు హాజరుకావాలని సూచించింది. మరోవైపు.. ఈ రోజు విచారణ ముగిసిన తర్వాత రేపు ఉదయం 10 గంటలకు మళ్లీ విచారణకు రావాలని లక్ష్మి దుర్గకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సూచించారు.
