Site icon NTV Telugu

Electricity Charges Hike: ఏపీలో భారీగా పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు.. ఇలా వడ్డింపు..

ప్రజలపై క్రమంగా భారం మోపుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు… పెట్రోల్, డీజిల్‌, గ్యాస్‌, ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్‌ ఛార్జీలు… ఇలా అవకాశం ఉన్న ప్రతీది వడ్డించేస్తున్నారు.. ఇప్పటికే తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఏపీలో విద్యుత్‌ ఛార్జీల మోత మోగింది. కరెంట్‌ ఛార్జీలను పెంచుతూ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయం తీసుకుంది. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చింది ఈఆర్‌సీ.. వాటి ప్రకారం.. 30 యూనిట్ల వరకూ ఉన్న స్లాబ్‌కు 1.90 రూపాయల చొప్పున వసూలు చేయనుండగా.. ఈ స్లాబ్‌లో యూనిట్‌కు 45 పైసల చొప్పున పెంచారు. ఇక, 31-75 యూనిట్ల వరకూ ఉన్న స్లాబ్‌కు యూనిట్‌కు రూ.3 వసూలు చేస్తారు.. అంటే ఈ స్లాబ్‌లో యూనిట్‌కు 91 పైసల చొప్పున వడ్డించనున్నారు.. మూడో స్లాబ్‌ అయిన 76 -125 యూనిట్ల మధ్య యూనిట్ ధర రూ.4.50 చేశారు. ఈ స్లాబ్‌లో రూ.1.40 చొప్పున ప్రతి యూనిట్‌పై అదనంగా చెల్లించాలి..

Read Also: DA Hike: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్‌ కీలక నిర్ణయం

ఇక, నాల్గో స్లాబ్‌ విషయానికి వస్తే 126-225 వరకూ ఉన్న ఈ స్లాబ్‌లో యూనిట్ ధర రూ.6 పెంచేందుకు ఈఆర్సీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.. అంటే, ఒక్కో యూనిట్‌కు రూ.1.57 చొప్పున అదనంగా వసూలు చేస్తారు.. ఆ తర్వాత స్లాబ్‌లో 226-400 యూనిట్ల వరకూ ప్రతీ యూనిట్​కు రూ.8.75 చొప్పున వసూలు చేయనున్నారు.. అంటే, ఈ స్లాబ్‌లో ప్రతీ యూనిట్‌కు అదనంగా రూ.1.16 చొప్పున పెరగనుంది. ఇక, 400 ఆపైన యూనిట్లకు రూ.9.75 చొప్పున పెంచేందుకు అనుమతి వచ్చింది.. ఈ స్లాబ్‌లో ప్రతీ యూనిట్‌కు అదనంగా 55 పైసల చొప్పున పెంచేశారు.. ఏపీ ఈఆర్‌సీ తాజాగా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ నుంచి అమల్లోకి రాబోతున్నాయి..

Exit mobile version