ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను మోదీతో జగన్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55,548.87 కోట్లుగా నిర్ధారించిందని.. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరాన్ని ప్రధానితో ప్రస్తావించారు. ఇందులో నిర్మాణ పనులకోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ, పునరావాసంకోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వైజ్గా బిల్లుల చెల్లింపును సవరించాలని కోరారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్ర చెల్లిస్తున్న బిల్లులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందన్నారు. ఈ ఆంక్షల వల్ల రూ.905 కోట్ల బిల్లులను కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తిరస్కరించిందన్నారు. కాంపొనెంట్ వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టులో జరిగే పనులను పరిగణనలోకి తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా నిధులను సకాలంలో విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని ప్రధాని మోదీని జగన్ కోరారు.
మరోవైపు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపుకోసం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉందని.. దీనివల్ల ఏపీకి అన్యాయం జరుగుతోందని మోదీ వద్ద జగన్ ప్రస్తావించారు. రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలకు రేషన్ అందిస్తుంటే.. ఇందులో కేంద్రం నుంచి కేవలం 0.89 కోట్ల కుటుంబాలకు మాత్రమే అందుతోందన్నారు. మిగిలిన 0.56 కోట్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు ఖర్చుచేస్తూ రేషన్ ఇస్తోందని జగన్ తెలిపారు. ఆర్థికంగా బాగున్న మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని 75శాతం, పట్టణ, నగర ప్రాంతాల్లోని 50శాతం ప్రజలకు రేషన్ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే.. ఏపీలో మాత్రం 61శాతం రూరల్, 41శాతం అర్బన్ ప్రజలకు మాత్రమే రేషన్ను ఇస్తున్నారని పేర్కొన్నారు. దీన్ని వెంటనే సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.
భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్ గడువు ముగిసిందని.. తాజాగా క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పౌరవిమానయాన శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెకాన్ ఇప్పటికీ తన నివేదికను ఇవ్వలేదని జగన్ తెలిపారు. రాయలసీమ, కడప జిల్లా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నడుంబిగించిందన్నారు. దీని కోసం వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేసిందన్నారు. ఈమేరకు కేంద్రం తోడ్పాటు అందించాలని కోరారు.
అలాగే ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బీచ్శాండ్ మినరల్స్ ప్రాంతాలను కేటాయించాలని ప్రధానిని విజ్ఞప్తి చేసినట్లు జగన్ తెలిపారు. 16 చోట్ల బీచ్శాండ్ ఉన్న ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించాలని కోరానన్నారు. అటమిక్ ఎనర్జీ విభాగం ఇప్పటికే 2 ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించిందని.. దీనికి సంబంధించిన అనుమతులు కూడా పెండింగులో ఉన్నాయన్నారు. మిగిలిన 14 ప్రాంతాలకు సంబంధించి కేటాయింపులు, అనుమతులకు ఆదేశాలివ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.
కరోనా వంటి మహమ్మారులు సోకినప్పుడు ప్రజారోగ్య వ్యవస్థ ఎంత కీలకమో ఇటీవల కోవిడ్ పరిస్థితుల్లో వెల్లడైందని.. ప్రజారోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను గణనీయంగా పెంచడానికి ఏపీ ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులు ఉన్నాయని.. కొత్తగా మరో మూడింటికి కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని.. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. మరో 12 బోధనాసుపత్రులకు కూడా వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు
విభజన కారణంగా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని.. రెవిన్యూ గ్యాప్ను భర్తీ కోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన నాటికి పెండింగ్ బిల్లుల బకాయిల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలులో భాగంగా ఇవ్వాల్సి బకాయిల రూపంలో తదితర కార్యక్రమాల వల్ల దాదాపు రూ.32,625.25 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంతంగా ఖర్చు చేసిందని.. ఈ నిధులను రెవిన్యూ లోటు కింద భర్తీచేయాలని జగన్ కోరారు. రాష్ట్ర విభజన వల్ల 58.32శాతం జనాభా విభజిత ఆంధ్రప్రదేశ్కు రాగా, కేవలం 46శాతం రెవిన్యూ మాత్రమే దక్కిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 9శాతం జానాభా ఉన్న హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడం ద్వారా ఆ నగరం నుంచి అందే 38 శాతం రెవిన్యూను కోల్పోయామన్నారు. తర్వాత వచ్చిన కోవిడ్.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీసిందని తెలిపారు. దాదాపు రూ. 33,478 కోట్ల మేర ఆదాయం కోవిడ్ కారణంగా రాకుండాపోయిందని.. కోవిడ్ నివారణా, చికిత్సల కోసం మరో రూ.7,130 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయని.. 15వ ఆర్థిక సంఘం కేటాయింపులు కూడా రాష్ట్రానికి తగ్గడం మరొక ప్రతికూల పరిణామమని జగన్ వివరించారు.
గత ప్రభుత్వం హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చారని.. ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా… రాష్ట్ర రుణపరిమితుల్లో కోత విధిస్తామని అంటున్నారని… దీనివల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని జగన్ తెలిపారు. విధించిన రుణ పరిమితిని మించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రుణాలు తీసుకురాలేదని.. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రుణాల పరిమితిని సవరించాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు.
తెలంగాణ డిస్కంలు రూ.6,455.76 కోట్ల రూపాయలను ఏపీ జెన్కోకు చెల్లించాల్సి ఉందని.. రాష్ట్రాన్ని విభజించిన నాటి నుంచీ జూన్ 2017 వరకూ తెలంగాణ డిస్కంలకు చేసిన విద్యుత్ పంపిణీకి సంబంధించి ఈమొత్తాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బును ఇప్పించాల్సిందిగా కోరారు. ఈమేరకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తీవ్ర రుణభారాన్ని ఎదుర్కొంటున్న ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు తమ ఆర్థిక నిర్వహణకోసం ఈ డబ్బు చాలా అవసరమని జగన్ పేర్కొన్నారు.
