TDP Gouthu Sirisha : టీడీపీ మహిళా నేతకు సీఐడీ నోటీసులు..

Gouthu Sirisha

Gouthu Sirisha

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందడం లేదంటూ కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేస్తు్న్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలోనే ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాకుండా.. కొంతమందికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ మహిళా నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని, లబ్ధిదారులకు ఈ ఏడాది ఆ రెండు పథకాలు అందవంటూ ప్రభుత్వ చిహ్నంతో ఉన్న ఓ నకిలీ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న ఆరోపణలపై అధికారులు ఆమె గత రాత్రి 10 గంటలకు నోటీసులు ఇచ్చారు.

రేపు ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కాగా, ఇదే ఆరోపణపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అనుచరుడు, టెక్కలి నియోజకవర్గ ఐటీడీపీ కో ఆర్డినేటర్ అప్పిని వెంకటేశ్‌ను నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. కాగా, నోటీసులు అందుకున్న శిరీష విచారణకు హాజరుకానున్నట్టు వెల్లడించారు.