CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!

  • ఇంటి వద్దే 42 వైద్య పరీక్షలు.. సంజీవని స్పెషల్
  • డిజిటల్ హెల్త్ కార్డులతో కొత్త వైద్య విధానం
  • ఏఐ డాక్టర్ సేవలు.. త్వరలోనే అందుబాటులోకి
  • కుప్పం నుంచి రాష్ట్రవ్యాప్త విస్తరణకు సంజీవని రెడీ
CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేపింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం కండ్రిగలో జరిగిన ‘సంజీవని’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు హనుమంతుడు తెచ్చిన సంజీవని మొక్కను గుర్తుచేస్తూ, అదే స్ఫూర్తితో డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ సరికొత్త ‘సంజీవని’ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసినట్లు సీఎం వెల్లడించారు.

ఈ సభలో సీఎం చంద్రబాబు ఆరోగ్యం ప్రాధాన్యత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మనిషికి ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే వృథా అని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారే అందరికన్నా నిజమైన ధనవంతులని పేర్కొన్నారు. ఏదో బతికి ఉన్నాం కదా అని మంచంపై కాలం వెళ్లదీయడం కాకుండా, ప్రతి ఒక్కరూ హెల్తీగా బతకడమే ముఖ్యమన్నారు. భవిష్యత్తులో మన పిల్లలే మన సంపద అని, ఆరోగ్యవంతమైన ప్రజలు ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలకు సైతం అత్యుత్తమ కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ఈ సంజీవని ప్రాజెక్టు మెయిన్ ఎయిమ్ అని స్పష్టం చేశారు.

సమాజం బాగుండాలంటే ప్రజలు ఫిట్‌గా ఉండాలని, అందుకోసమే ప్రిడిక్టివ్ (ముందుగా ఊహించడం), ప్రివెంటివ్ (నివారించడం), క్యూరేటివ్ (నయం చేయడం) అనే మూడు అంచెల విధానంలో సంజీవని ప్రాజెక్టును ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. వ్యాధులు వచ్చాక బాధపడటం కంటే, అవి రాకముందే గుర్తించి అలర్ట్ చేయడమే నిజమైన డెవలప్‌మెంట్ అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ల్యాబ్‌లకు వెళ్లే అవసరం లేకుండా ఏకంగా 42 రకాల వైద్య పరీక్షలను నేరుగా ఇంటి వద్దే నిర్వహించి నిమిషాల్లో రిపోర్టులు ఇచ్చేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. డాక్టర్ అప్పాయింట్‌మెంట్, వర్చువల్ కనెక్ట్ ద్వారా టాప్ డాక్టర్స్ వైద్య సలహాలు, సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డుల మానిటరింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

ఈ సంజీవని ప్రాజెక్టు అనేది కేవలం ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదని, ఇదొక అత్యుత్తమ ‘డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఆపరేటివ్ సిస్టమ్’ అని చంద్రబాబు అభివర్ణించారు. ప్రజలను అనారోగ్యం నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చే ‘సిటిజన్ వెల్‌నెస్ మిషన్’ ఇదన్నారు. టెక్నాలజీని వాడుకోవడంలో ఎప్పుడూ ముందే ఉండే చంద్రబాబు సర్కార్.. త్వరలోనే ఈ ప్రాజెక్టులో భాగంగా ‘ఏఐ డాక్టర్’ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా కూడా ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించబోతున్నట్లు క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

గత ఏడాది జూలైలో కుప్పం నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును పైలట్‌గా ప్రారంభించి, మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రోల్ అవుట్ చేశారు. జిల్లాలోని 19.75 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడేలా ప్రజారోగ్య వ్యవస్థను సిద్ధం చేశారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్‌తో రాబోయే ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం) నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును ఫుల్ స్కేల్‌లో లాంచ్ చేయాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు అనౌన్స్ చేశారు.

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పందించారు. ఈ సంవత్సరం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ రిపోర్ట్స్ చెప్తున్నాయని, అయితే ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని ప్రజలకు భరోసా ఇచ్చారు.