ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రానికి ఏడు నూతన ఈఎస్ఐ ఆస్పత్రులను మంజూరు చేసింది. సోమవారం నాడు పార్లమెంట్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొత్త ఈఎస్ఐ ఆస్పత్రుల వివరాల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విశాఖలో రూ.384.26 కోట్లతో సీపీడబ్ల్యూడీ శాఖతో నూతన ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మితం అవుతుందని.. విజయనగరంలో రూ.73.68 కోట్ల కేంద్ర నిధులతో MECON కంపెనీ ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మితం అవుతుందని.. కాకినాడలో రూ.102.77 కోట్ల కేంద్ర నిధుల కేటాయింపుతో సీపీడబ్ల్యూడీ శాఖ సహకారంతో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని కేంద్రం వెల్లడించింది.
మరోవైపు గుంటూరు, పెనుకొండ, విశాఖ, అచ్యుతాపురం, నెల్లూరు శ్రీ సిటీలకు నూతన ఈఎస్ఐ ఆసుపత్రులు మంజూరు చేశామని.. అయితే అవి ఇంకా భూసేకరణ దశలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఏపీలో ఇంకా పునర్నిర్మాణంలో మూడు ప్రధాన ఈఎస్ఐ ఆసుపత్రులు ఉన్నాయంది. రాజమండ్రిలో 2020, ఆగస్టు 19న రూ.97.97 కోట్లు కేటాయించబడి ఇప్పటివరకు 10.90 కోట్ల నిధుల విడుదలతో సీపీడబ్ల్యూడీ శాఖ ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రి పునర్నిర్మాణంలో ఉందని కేంద్రం తెలిపింది. విశాఖ జిల్లా మల్కీపురంలో 2019, నవంబర్ 13న రూ.79 కోట్ల కేటాయింపుతో ఇప్పటివరకు రూ.19.16 కోట్ల నిధుల విడుదలతో సీపీడబ్ల్యూడీ శాఖ ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రి పునర్నిర్మాణంలో ఉందని.. విజయవాడలో కూడా సీపీడబ్ల్యూడీ శాఖకు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందని కేంద్రం తెలియజేసింది.
కాగా ఆరోగ్య వసతుల లేమితో బాధపడుతున్న ఏపీ ప్రజలకు కేంద్రం మంజూరు చేసిన ఈఎస్ఐ ఆస్పత్రుల వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.
