పేదలకు దక్కాల్సిన ఇళ్లను కూడా వైసీపీ నేతలు అవినీతికి ఆదాయ వనరుగా మార్చుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3.16లక్షల ఇళ్ళు కట్టి 2.62లక్షలు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంచిందని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి రూ.5 లక్షల ఇచ్చి పేదలకు ఏటా 5లక్షల ఇళ్లు కడతానని జగన్ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, గత 3 ఏళ్లలో 15లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉండగా జగన్ కేవలం 5 ఇళ్లు మాత్రమే నిర్మించారని విమర్శించారు.
సెంటు భూమి పథకంలో వైసీపీ ఎమ్మెల్యేలు రూ.5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అనేక చోట్ల నివాసయోగ్యం కాని చోట సెంటు పట్టాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. పేదలు ఇళ్లు కట్టుకోలేని విధంగా ఇసుక, సిమెంట్ ధరలు విపరీతంగా పెంచారని, ధైర్యం ఉంటే గృహనిర్మాణం పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన సవాల్ విసిరారు. అవినీతికి పాల్పడుతున్నారని మాట్లాడిన వారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.