NTV Telugu Site icon

Gidugu Rudraraju: మణిపూర్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ.. మోడీ రాజీనామా చేయాలి

Gidugu On Pm Modi

Gidugu On Pm Modi

APCC Chief Gidugu Rudraraju Demands PM Narendra Modi To Resign Over Manipur Violence: మణిపూర్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. మణిపూర్‌లో జరిగిన దారుణాలపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించింది. ఏపీసీసీ కార్యాలయం నుంచి లెనిన్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణిపూర్‌లో జరిగిన హింస, అత్యాచారాలు సభ్యసమాజం తల‌దించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం నివ్వెరపోయే ఈ ఘటనల్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని అన్నారు. మణిపూర్ ఘటనలపై ప్రధాని మోడీ ఇప్పటిదాకా స్పందించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.

Kakani Govardhan Reddy: చంద్రబాబు ఉంటే.. కరువు రాజ్యమేలుతుంది

మణిపూర్ ఘటన చోటు చేసుకుని మూడు నెలలు అవుతున్నా.. ఇంతవరకు నిందితులపై చర్యలు తీసుకోలేదని గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సీజే సుమోటోగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ మణిపూర్‌కి వెళ్తే, అడ్డుకున్నారని పేర్కొన్నారు. మణిపూర్ ఘటన‌పై తాము శాంతియుతంగా ప్రదర్శన చేశామన్నారు. ఆదివాసీ మహిళల హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరారు. మణిపూర్ సీఎం, గవర్నర్‌లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సుప్రీం ఆదేశాలతోనైనా స్పందించి.. బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రధాని మోడీ భారత జాతికి క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. మోడీ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాలపై దాడులు పెరిగాయని చెప్పుకొచ్చారు.

Pilli Subhash Chandrabose: పిల్లి సుభాష్ కీలక వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ

ఇంతకుముందు కూడా.. దేశ రాజకీయాల్లో ప్రధాని మోడీని ధీటుగా ఎదుర్కొనే సత్తా, కేవలం తమ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకే ఉందని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. పార్లమెంట్‌లో రాహుల్‌ లేవనెత్తిన అంశాలపై మోడీ సమాధానం చెప్పలేకపోయారని, అందుకే ఆయన్ను టార్గెట్‌ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు.