Minister Durgesh: ముంబై పర్యటనకు మంత్రి దుర్గేష్.. ఫిల్మ్ టూరిజంలో పెట్టుబడులే లక్ష్యంగా..

  • రెండు రోజులు ముంబై పర్యటనకు వెళ్లిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్..
  • 12వ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ -2025కు హాజరు కానున్న మంత్రి దుర్గేష్..
  • ఫిల్మ్ టూరిజంలో పెట్టుబడులను ఆహ్వానించనున్న మంత్రి కందుల దుర్గేష్
Durgesh

Durgesh

Minister Durgesh: ఏపీ సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ డిసెంబర్ 1, 2వ తేదీల్లో ముంబైలో పర్యటించనున్నారు. ముంబైలోని జుహూలో ఉన్న జేడబ్ల్యూ మారియట్ హోటల్ లో జరగనున్న 12వ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ -2025కు హాజరు కానున్నారు. ప్రస్తుత ఏఐ యుగంలో మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం యొక్క భవిష్యత్తు వృద్ధికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించే ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొని కీలకోపన్యాసం చేయనున్నారు ఆయన. భారతీయ మీడియా & ఎంటర్టైన్మెంట్ రంగాన్ని $100 బిలియన్ల భవిష్యత్తు వైపు నడిపించేందుకు ఏపీ ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేయనున్నారు.

Read Also: CPI Narayana: ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుట్టుకొస్తారు..

ఇక, ఆంధ్రప్రదేశ్‌ను సృజనాత్మక రంగానికి “ఆంధ్రా వ్యాలీ” గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కంటెంట్ క్రియేషన్ కోసం AI- ఆధారిత టూల్స్, XR టెక్నాలజీలు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారీగా పెట్టుబడి పెట్టడం ద్వారా యానిమేషన్, గేమింగ్, VFX లకు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా మారుస్తామని పేర్కొన్నారు. సుస్థిరమైన, పారదర్శకమైన, వ్యాపార అనుకూలమైన ఏపీ పరిపాలన వ్యవస్థను విశ్వసించి ఫిల్మ్ టూరిజంలో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. అలాగే, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నూతన అధ్యాయాన్ని రచిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ముంబైకి మంత్రి దుర్గేష్ బయలుదేరి వెళ్లారు.